ముంబయి – భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం కొంత మందగించింది. శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరమైన 2023-24లో నమోదైన 9.2 శాతం వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెల్లడించింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉండవచ్చని ఎన్ఎస్ఓ తన రెండో ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ప్రస్తుతం విడుదలైన గణాంకాలు ఆ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కొవిడ్ మహమ్మారి సంక్షోభం తదనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకున్న తర్వాత, వృద్ధి రేటు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇక, 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి 2025) విషయానికొస్తే, జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైంది. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 8.4 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువేనని ఎన్ఎస్ఓ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, చైనా ఆర్థిక వ్యవస్థ 2025 మొదటి మూడు నెలల కాలంలో (జనవరి-మార్చి) 5.4 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.