ఈనెల 23న ఇంద్రకీలాద్రిపై గాజుల మహోత్సవం
- ఏర్పాట్లు చకచక
- పెద్ద ఎత్తున గాజులు వితరణ దాతలు రాక
- దాతలు నుండి గాజులు స్వీకరించిన చైర్మన్ గాంధీ ఈవో శీనా నాయక్..
విజయవాడ, ఆంధ్రప్రభ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానంలో గాజుల మహోత్సవానికి చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఆట ఆనవాయితీగా నిర్వహిస్తున్న గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి దివ్య మంగళ స్వరూపంతో పాటు ప్రధానాలయం ఉపాయం ఇంద్రకీలాద్రి అంతట వర్ణమాల గాజులతో అలంకరించనున్నారు.
ఈనెల 23వ తేదీన నిర్వహించే ఈ గాజుల మహోత్సవానికి సంబంధించి మంగళవారం వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ గాజుల మహోత్సవానికి సంబంధించి ప్రతి ఏటా దాతలు పెద్ద ఎత్తున విరాళంగా గాజులను అందిస్తూ ఉంటారు.
ప్రత్యేక పూజలతో ప్రారంభం..
ఇంద్రకీలాద్రిపై ఈనెల 23వ తేదీన నిర్వహించే గాజుల మహోత్సవానికి సంబంధించి మంగళవారం వైదిక కమిటీ ఆధ్వర్యంలో దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయక్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అలాగే పలువురు దాతలు విరాళంగా అందజేసిన గాజులను స్వీకరించారు. గాజుల అలంకరణకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా అలంకరణ కోసం దండలను సేవా కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు గాజులను కడుతున్నారు.