ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి : పశుపోషకులు, రైతులు తమ పశువులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో సామూహిక ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల్లో పశువులకు టీకా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలన్నారు. పశువులకు వ్యాధి సోకకుండా కచ్చితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. ఈకార్యక్రమంలో పశువైద్య సహాయక సిబ్బంది హీరాలాల్, రాందాస్, భూమన్న, రైతులు పాల్గొన్నారు.