భారత్, సఫారీ జట్ల మధ్య తొలి టెస్టు
ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ప్రారంభం
టాపార్డర్ను కూల్చిన భారత బౌలర్లు
cricket | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తొలి టెస్టు ఆడుతోంది. సఫారీ కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు నెలల గ్యాప్ తర్వాత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. అలాగే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ టెస్టుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్లో భారత జట్టుకు కెప్టెన్ శుభ్మన్ గిల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. యువ బ్యాటర్ సాయి సుదర్శన్పై వేటు వేసి, అతని స్థానంలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉండటంతో భారత బౌలింగ్ విభాగం స్పిన్ బలంగా కనిపిస్తోంది. పేస్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మోయనున్నారు. మరోవైపు పర్యాటక దక్షిణాఫ్రికా జట్టుకు మ్యాచ్కు ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబడ పక్కటెముకల గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీ సఫారీ బౌలింగ్పై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

టాప్ లేపారు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలను భారత బౌలర్లు శుభారంభం అందించారు. 105 రన్స్కు 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా (IND vs SA) టాపార్డర్ను కుప్పకూల్చారు. ఓపెనర్లు మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 10.3 ఓవర్లో రికెల్టన్ను (23) క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన బవుమా ఆచితూచి ఆడుతుండగా, మరోఎండ్లో ధాటిగా ఆడుతున్న మార్క్రమ్ను బుమ్రా ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 12.1వ ఓవర్లో 31 రన్ చేసిన మార్క్రమ్ వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్కు చేరాడు. ఇక కెప్టెన్ బవుమాను (3) కుల్దీప్ బుట్టలోపడేశాడు. 15వ ఓవర్ చివరి బంతికి జురెల్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం వియాన్ ముల్డర్, క్రీజ్లో ఉన్నారు. బుమ్రా 2 వికెట్లు తీసుకోగా, కుల్దీప్కు ఒక వికెట్ దక్కింది.


