జ్వరంతో మహిళ మృతి
- మన్యంలో మొదటి మరణం
రాజవొమ్మంగి (ఏఎస్ఆర్ జిల్లా), ఆంధ్రప్రభ : అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetharamaraju District) లోని మన్యంలో జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. రంపచోడవరం (Rampachodavaram) నియోజకవర్గ పరిధి రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామంలో జగ జనని (29) అనే మహిళ మృతి చెందింది. మన్యం (Manyam) లో జర్వాలతో మొదటి మరణం నమోదు కావడంతో మన్యం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని లాగరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గ్రామ పంచాయతీలైన కిండ్ర, లబ్బర్తి, లాగరాయి మూడు గ్రామాల్లో గత మూడు నెలలుగా విష జ్వరాలు విజృంభించాయి.
అంతుచిక్కని వ్యాధి..
జ్వరాలతో పాటు ఆదివాసీలకు అంతుచిక్కని వ్యాధితో అవస్థలు పడుతున్నారు. ఈ వ్యాధితో కాళ్లు, కీళ్లు నొప్పులతో పాటు, ఒళ్లు నొప్పులు రావడం తమ పని తాము కూడా చేసుకోలేని దుస్థితిలో గిరిజనులు ఉన్నారు. కూర్చుంటే నిలబడ లేక.. నిలబడితే కూర్చోలేక కష్టాలు పడుతున్నారు. లాగరాయి గ్రామానికి చెందిన మహిళ జ్వరంతో బాధపడుతూ ఈ రోజు కాకినాడ జిల్లా (Kakinada District) జీజీహెచ్లో మృతి చెందింది.
లాగరాయి గ్రామానికి చెందిన కొంతం జగ జనని (Jagajanani) (29) అనే మహిళకు రెండు నెలల క్రితం జ్వరం వచ్చి ఆసుపత్రిలో చూపించుకోవడంతో తగ్గింది. మళ్లీ జ్వరం రావడంతో ఆగస్టు 30వ తేదీన జ్వరంతో బాధపడుతూ లాగరాయి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయి నాలుగు రోజులు వైద్యం పొందగా, ఫలితం లేకపోవడంతో ఏలేశ్వరంలోని ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుండి కాకినాడ జీజీహెచ్ (Kakinada GGH) కు తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

