వివేకా మర్డర్ కేసులో దొరకని దోషులు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకే ముచ్చెమటలు
కీలక సాక్షులంతా వరుస మరణాలు
డ్రామాను తలపిస్తున్న పొలిటికల్ కస్టడీ
ఆరేండ్లుగా వీడని వివేకా మర్డర్ మిస్టరీ
విచారణలో సిట్కు అంతుచిక్కడం లేదు
ఇప్పటికే ఆరుగురు సాక్షులు దుర్మరణం
కీలక సాక్షి మరణం కూడా అనుమానాస్పదమే
ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న అప్రూవర్
న్యాయం కోసం పోరాడితే కేసులతో వేధింపులు
వివేకా కూతురి ఒంటరి పోరాటం ఇంకెన్నాళ్లో?
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సునీతా
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
ఏపీ రాజకీయ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ వివేకా హత్య జరిగి ఆరేళ్లు గడిచినా దర్యాప్తులో అతీగతీలేదు. దేశంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థ సీబీఐ సైతం ఇప్పటికీ అసలు కుట్రధారులు, సూత్రధారులను నిర్ధారించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికీ నాంపల్లి సీబీఐ కోర్టులో కేసు విచారణ ప్రారంభమే కాలేదు. ఈ కేసులో నిందితులు బెయిల్పై బయట తిరుగుతుండగా, తండ్రిని చంపిన కిరాతకులను శిక్షించాలని వివేకా కూతురు సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు. కీలక సాక్షులు మాత్రం ఒక్కొక్కరుగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందుతున్నారు.
తొలుత గుండెపోటని ప్రచారం
వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన చాపాడు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని పులివెందులలోని తన ఇంటికి చేరుకున్నారు. మార్చి 15వ తేదీ తెల్లవారుజాము 5.30కి వివేకా ఇంటికి చేరుకున్న అతని పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి ఎంత ప్రయత్నించినా తలుపులు తెరవకపోవడంతో 6 గంటలకు వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు. ఉదయం 6.30 గంటలకు వెనుక డోర్ తెరచి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో వివేకా మృతదేహం కనిపించింది. ఆపైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కుమార్తె డాక్టర్ సునీత కోరిక మేరకు ఆమె వచ్చేవరకూ ఆగి సాయంత్రం 4 గంటలకు డాక్టర్లు, రిమ్స్ వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు.
గుండెపోటు మరణమని ప్రచారం..
వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని తొలుత ప్రచారం జరిగింది. కానీచ ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇది సహజ మరణం కాదనీ, హత్యగా నిర్ధారించారు. 15వ తేదీ సాయంత్రం నిర్వహించిన పోస్టుమార్టంలో వివేకానంద రెడ్డి మృతదేహం మీద 7 కత్తిపోట్లు ఉన్నాయనీ, మెడ మీద, వెనుక, చేతి మీద, తొడ మీద బలమైన గాయాలున్నాయనీ తేలింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టులో అప్పటి వైసీపీ నేత పిటిషన్ వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకా హత్య కేసు తేల్చేందుకు పోలీసుల ఆధ్వర్యంలో మూడు సిట్లు ఏర్పాటు చేసినా కేసులో ఎలాంటి పురోగతి లేదు.
రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ..
వివేకా కుమార్తె సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సిట్ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తన పిటీషన్ను జగన్ మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. ఇక సునీత పిటిషన్ను పరిగణలోకి తీసుకుని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వాచ్మన్ రంగన్న వాంగ్మూలంతో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరిని నిందితులుగా గుర్తించింది. వీరందరినీ అరెస్ట్ చేయగా దస్తగిరి అఫ్రూవర్గా మారాడు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో అసలు కుట్రధారులు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.
నిందితుడిగా ఎంపీ అవినాష్రెడ్డి..
కడప ఎంపీగా ఉన్న అవినాష్రెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయడానికి యత్నించగా అప్పటి ప్రభుత్వం నుంచి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రస్తుతానికి ఎర్రగంగిరెడ్డి మినహా మిగిలిన నిందితులంతా బెయిల్పై బయటకు వచ్చారు. తండ్రి హత్యపై న్యాయపోరాటం చేస్తున్న సునీతపైనా, సీబీఐ ఎస్పీ రాంసింగ్పైనా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టడం విశేషం. అవి తప్పుడు కేసులని పులివెందుల పోలీసులు మార్చి 13వ తేదీన జమ్మలమడుగు కోర్టులో ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేశారు.
ఆరుగురు సాక్షులు అంతర్థానం
ఆరేళ్లుగా కేసు నత్తనడకన సాగుతున్న తరుణంలో ఆరుగురు కీలక సాక్షులు ఆనుమానాస్పద రీతిలో మృతిచెందారు. నిందితులను కళ్లారా చూసిన ప్రత్యక్షసాక్షి రంగన్న మృతి సైతం అనుమానాస్పదం కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరుగురు సాక్షుల మరణాల వెనక నిజాలు వెలికితీసేందుకు వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, వివేకా కూతురు సునీతారెడ్డి ఈ మధ్యనే మళ్లీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టులో త్వరగా విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.