సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : అదిరేటి డ్రెస్సు మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ.. మీకు దడ.. సరదాగ ర్యాంప్ ఎక్కిన వనితేలే నేటి సెన్సేషన్.. కన్నె చూపుల్లో ఉన్నదిలే సూపర్ టెంప్టేషన్ ఈ పాట వింటుంటే కుర్రకారుకే కాదు, సడుగులిరిగిన శృంగార సింగార బాబులకూ గుండెదడ తప్పదేమో. ఇక.. భారీ ర్యాంప్పై 140 దేశాల అందెగత్తెల వయ్యారాలు ఒలకబోస్తుంటే చూసి తరించని వారుండరేమో. వారి వంపు సొంపులు, వయ్యారాల నడకలు.. చిరునవ్వుల పలకరింపులు.. కొంటె చూపులు అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి. ఈ అందాల విందుకు విశ్వగనగరి భాగ్యనగరం వేదిక కాబోతోంది.
21 ప్రదేశాల్లో 23 థీమ్లతో ఈవెంట్లు..
అందం, ప్రతిభను చాటడమే కాకుండా తెలంగాణ సాంస్కృతిక వైభవం, సంప్రదాయలతో పాటు పర్యాటక ప్రాంతాల అందచందాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాష్ట్రానికి దక్కుతోంది.
‘తెలంగాణ… జరూర్ ఆనా’ (తెలంగాణకు తప్పక రండి) అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. మే 10వ తేదీన హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుక మే 31వ తేదీన హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది.
మొత్తం 21 ప్రదేశాల్లో 23 థీమ్ లతో ఈవెంట్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విస్తృతమైన అంతర్జాతీయ మీడియా కవరేజీ, లక్షలాది మంది ప్రపంచ వీక్షకులతో ఈ ఫెస్టివల్ హైలెట్ కాబోతుందని వివరించారు. 24 రోజుల పండుగ ఇలా మే 31న హైటెక్స్ లో జరిగే గ్రాండ్ ఫినాలేకు ముందు జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పోటీదారులు మే 6, 7 తేదీల్లో నగరానికి చేరుకుంటారు.
మే నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో తెలంగాణ ఆటపాటలతో ఘనంగా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ పోటీల్లో భాగంగా బుద్ధవనం, చౌమహల్లా ప్యాలెస్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.
మెడికల్ అవేర్ నెస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని ప్రధాన ఆస్పత్రులను అందగత్తెలు సందర్శిస్తారు. మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ఫినాలే జరగనుంది. కాంటినెంటల్ గ్రూపుల్లో కంటెస్టెంట్లను జడ్జ్ చేసే కాంటినెంటల్ ఫినాలే మే 20, 21 తేదీల్లో టీ-హబ్ లో జరగుతుంది.
మే 22న శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, 23న ఐఎస్ బీలో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ జరుగుతాయి. మే 24న హైటెక్స్ లో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే, 25న జువెలరీ అండ్ పెర్ల్ షో నిర్వహించనున్నారు. ఫైనల్ గా మే 31న హైటెక్స్ లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే లో విజేతకు కిరీటం దక్కుతుంది.
అంత ఖర్చు అవసరమా? :
కేటీఆర్ మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం ₹200 కోట్లు ఖర్చు చేస్తున్నారని.. రాష్ట్ర ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం చెల్లించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేస్ కోసం రూ.46 కోట్లు ఖర్చు చేస్తే కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కానీ రూ.200 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మిస్ వరల్డ్ పోటీ నిర్వహించడం కరెక్టేనా..? అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
ఖర్చు ₹27 కోట్లే.. ప్రభుత్వం సమాధానం
మిస్ వరల్డ్ అందాల పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందన్న ఆరోపణలను పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తోసిపుచ్చారు. ప్రభుత్వం కేవలం రూ.27 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందని… ఈ కార్యక్రమానికి వచ్చే నిధుల్లో ఎక్కువ భాగం కార్పొరేట్ స్పాన్సర్షిప్స్ నుంచే వస్తున్నాయని ఆమె గురువారం మీడియా సమావేశంలో చెప్పారు.
భారతీయ విశ్వ సుందరీమణులు వీరే ..72 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో ఇప్పటికి ఆరుగురు భారతీయ ముద్దుగుమ్మలు ప్రపంచ సుందరీమణులుగా వెలిగారు. గోవా అందగత్తె రీటా పారియా పావెల్ చరిత్ర సృష్టించింది. 1966లో ర్యాంప్ పై తొలి ఆసియా వైద్యురాలిగా రికార్డుతో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. 1994లో ఐశ్వర్య రాయ్ విశ్వసుందరిగా నిలిచింది. 1997లో భారతీయ మోడల్ డయానా హెడేన్ మిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. 1999లో భారతీయ మోడల్ యుక్తాముఖీ మిస్ వరల్డ్ రేస్ లో విజేతగా నిలిచింది. 2000లో బొంబాయి తార ప్రియాంక చోప్రా తో భారతీయ సుందరీమణుల చరిత్రను సృష్టించింది. ఆ తరువాత 2017లో హర్యానా ముద్దుగుమ్మ మాపుషి చిల్లర్ విశ్వసుందరీ కిరీటాన్ని ముద్దాడింది.