Exclusive | బాహుబలి విక్రాంత్​! యుద్ధానికి సిద్ధంగా భారత్​ నేవీ

ఆరేబియాలో విక్రాంత్, విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ ల మోహ‌రింపు
రెడీగా ఉన్న యుద్ద నౌక‌లు, జ‌లంతార్గాములు
వాయు, జల, ఉపరితలంపై భిన్న కార్యకలాపాలు
మల్టీ పర్పస్​ వార్​ క్యారియర్​గా ఐఎన్​ఎస్​ విక్రాంత్​
పాక్​ వైమానికి, రక్షణ స్థావరాలపై కన్నేసిన నేవీ​
విక్రాంత్​ పైనుంచి నింగిలోకి ఎగరనున్న మిగ్‌‌–29
ఏకబిగిన 850 కిలోమీటర్లు వెళ్లే కెపాసిటీ వీటి సొంతం
పాక్​ పోర్టుల్లోని ఇంధన నిల్వలు నాశనం చేసే చాన్స్​
విక్రాంత్​ మోహరింపుతో పాక్​ సైన్యంలో వణుకు
1971లో విశాఖ సమీపంలో ఘాజీని దెబ్బతీసిన చరిత్ర మనది
ఆపరేషన్​ ట్రడెంట్​ను గుర్తుచేస్తున్న రక్షణరంగ నిపుణులు
పాకిస్తాన్​ నేవీకి అంత సీన్​ లేదంటున్న పరిశీలకులు

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ :

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్​ నేవీ యుద్ధ సన్నద్ధాల్లో నిమగ్నమైంది. ఈ నెల 24వ తేదీన ఐఎన్‌ఎస్‌ సూరత్‌ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్‌ క్షిపణి పరీక్ష జరిగింది. సముద్రతలానికి చేరువగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది. యుద్ధవిమానాలు, యూఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్‌ క్షిపణులను నేల కూల్చడానికి ఎంఆర్‌శామ్‌ ఉపయోగపడుతుంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను నేవీ పరీక్షించింది. యుద్ధసన్నద్ధతను చాటింది.

పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా..

మ‌న దేశానికి ఉన్న రెండు యుద్ద విమానా వాహ‌క నౌక‌లు ఐఎన్ఎస్ విక్రాంత్‌. ఐఎన్ఎస్ విక్రమాదిత్య​ రంగంలోకి దిగాయి. ఈ రెండు యుద్ధ నౌకలు పాక్​ సమీపంలోని అతికీల‌క ప్రదేశంలో మోహరించాయి. విమానవాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధ నౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట ఉంటుంది. వీటన్నింటినీ కలిపి క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌ (సీబీజీ)గా పిలుస్తారు. ఇది శత్రువులను తుత్తునియలు చేసే చాలా శక్తిమంతమైన బృందం. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి సీబీజీ ఎంతో ఉపయోగపడుతుంది.

వాణిజ్య స్థావ‌రాల‌పై అటాక్‌కు య‌త్నాలు..

విక్రాంత్‌ కదలికలను బట్టి.. పాక్‌ వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్‌ల దిగ్బంధానికి భారత్‌ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఆ దేశ వాణిజ్యంలో 60 శాతానికిపైగా ఈ రేవుల నుంచే సాగుతోంది. పాక్‌ తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగ్బంధంతో పాక్​లో పెట్రోలు, డీజిల్‌తోపాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా పాక్​లోని మూడోవంతు విద్యుదుత్పత్తిపై ప్రభావం పడుతుంది. తీరం నుంచి 700 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌పై విక్రాంత్‌ దృష్టిపెట్టినట్లు సమాచారం అందుతోంది. ఎందుకంటే పాక్‌ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువభాగం ఇక్కడే కేంద్రీకృతం అయినట్టు తెలుస్తోంది.

యుద్ధ రంగంలో విక్రాంత్​దే కీ రోల్​..

ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే.. విక్రాంత్‌.. కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ క్యారియర్‌ గ్రూప్‌కు వాయు, ఉపరితల, సముద్ర గర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం ఉంది. విక్రాంత్‌పై ఉండే మిగ్‌-29కె ఫైటర్‌ జెట్‌లు పాకిస్థాన్‌లోని మస్రూర్, సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను నాశనం చేసే కెపాసిటీ కలిగి ఉన్నాయి.. ఈ యుద్ధ విమానాలు ఏకబిగిన 850 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు. భారత వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్‌ సైనిక ఆదేశిక, నియంత్రణ వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయవచ్చు. పోర్టుల్లోని కీలక మౌలిక వసతులు, ఇంధన నిల్వ వసతులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడానికి ఎక్కవు చాన్సెస్​ ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.

విక్రాంత్​ మోహరింపు.. పాక్​ వెన్నులో వణుకు

ఉగ్రదాడి అనంతరం నౌకాదళం చేపట్టిన చర్యల్లో ముఖ్యమైంది.. విమానవాహకనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మోహరింపు. ఇది కర్నాటకలోని కార్వార్‌ నౌకాస్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో చేరినట్లు శాటిలైట్‌ చిత్రాలు స్పష్టంచేశాయి. ప్రస్తుతం విక్రాంత్​ అరేబియా సముద్రంలో సంచరిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన భారీ యుద్ధనౌక కదలికలు పాక్ సైన్యానికి గుబులు పుట్టిస్తున్నాయి. కాగా, విక్రాంత్‌పై మిగ్‌-29 యుద్ధవిమానాలు, కామోవ్‌-31 వంటి హెలికాప్టర్లు సహా 40 లోహ విహంగాలను మోహరించొచ్చు. 64 బరాక్‌ క్షిపణులు, శక్తిమంతమైన బ్రహ్మోస్‌ క్రూజ్‌ క్షిపణులను తీసుకెళ్లే కెపాసిటీ ఉంది. ఒటోబ్రెడా 76 ఎంఎం గన్స్, ఏకే-630 క్లోజిన్‌ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సర్లు ఇందులో ఉన్నాయి. శత్రు వైమానిక, క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ఐఎన్​ఎస్ విక్రాంత్​ సొంతం అని చెప్పవచ్చు.

సామరథ్యం లేని పాక్‌ నేవీ..

భారత నేవీ బలం, బలగం ముందు పాకిస్తాన్​ నౌకాదళం ఎందుకూ కొరగాదు. భారత్‌ వద్ద శక్తిమంతమైన విమాన వాహక నౌకలు రెండు ఉండ‌గా, యుద్ద నౌక‌లు 298, స‌బ్ మెరైన్స్ 18 ఉన్నాయి. ఇక డిస్ట్రాయ‌ర్స్ 13, ప్రిగెట్స్ 14 మ‌న అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నాయి. పాక్ వద్ద కేవలం 121 యుద్ద నౌక‌లు, 8 జ‌లాంత‌ర్గాములు మాత్ర‌మే ఉన్నాయి. చైనా నుంచి సమకూర్చుకున్న వార్‌షిప్‌లే ఆ దేశం వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. ఆధునికీకరణ నత్తనడకన సాగుతోంది. పాక్‌ నేవీకి చైనా తయారీ టైప్‌054ఏ/పీ ఫ్రిగేట్లు, తుర్కియే నిర్మిత మిల్జెమ్‌ కార్వెట్‌లే ఆధారం. వీటిలో అనేకం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. చైనా నుంచి సమీకరిస్తున్న హంగోర్‌ తరగతి సబ్‌మెరైన్లు 2028 నాటికిగానీ అందే అవకాశం లేదు. మరోవైపు భారత నౌకాదళ ఆధునికీకరణ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత నౌకా దిగ్బంధం ఉచ్చును తిప్పికొట్టే సామర్థ్యం పాక్‌ నేవీకి లేదనన్నది స్పష్టంగా తెలుస్తోంది.

అప్పట్లోనే మనకో విక్రాంత్​..

ప్రస్తుత విక్రాంత్‌కు పూర్వం భారత నౌకాదళంలో ఇదే పేరుతో ఒక విమానవాహక నౌక ఉండేది. అది 1971నాటి భారత్‌-పాక్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. తూర్పు పాకిస్థాన్‌ (నేటి బంగ్లాదేశ్‌)లోని చిట్టగాంగ్, కాక్స్‌ బజార్, ఖుల్నా వంటి నగరాలపై దాడి చేసింది. పాక్‌ నౌకాదళాన్ని దెబ్బతీయడంలో, తూర్పు పాకిస్థాన్‌కు సరఫరాలను అడ్డుకోవడంలో అప్పట్లో విక్రాంత్​ సాయపడిందని పరిశీలకులు చెబుతున్నారు.

నాటి విక్రాంత్‌ను అంతం చేద్దామనుకొని..

నాడు భారత నౌకాదళానికి వెన్నెముకగా ఉన్న విక్రాంత్‌ను పేల్చేయడానికి పాకిస్థాన్‌.. శక్తిమంతమైన జలాంతర్గామి పీఎన్‌ఎస్‌ ఘాజీని రంగంలోకి దించింది. దీన్ని పసిగట్టిన భారత నేవీ.. ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ అనే యుద్ధనౌకను విశాఖపట్నం వద్ద మోహరించి, దాన్ని విక్రాంత్‌గా పాక్‌ను ఏమార్చింది. ఇందుకోసం నకిలీ కమ్యూనికేషన్లను కొనసాగించింది. అదే సమయంలో విక్రాంత్‌ను అండమాన్, నికోబార్‌ దీవుల్లోని సురక్షిత ప్రదేశంలో ఉంచింది.

విక్రాంత్​గా పొరబడి చేరువలోకి వచ్చిన ఘాజీ..

ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ను విక్రాంత్‌గా పొరబడి.. ఘాజీ దానికి చేరువగా వచ్చింది. దీంతో భారత యుద్ధనౌక.. రెండు బాంబులను ప్రయోగించింది. ఆ వెంటనే సముద్రంలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. 93మంది సిబ్బందితో ఘాజీ జలసమాధి అయింది. సొంత మందుపాతర తగిలి అది పేలిపోయి ఉండొచ్చన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. నాడు ఈ ఘటనతో పాక్‌ నౌకాదళానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది.

కరాచీపై దాడి చేశారిలా..

1971 నాటి యుద్ధంలో భారత నౌకాదళం కరాచీ రేవుపై సాగించిన సాహసోపేత దాడి.. చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ఆ ఏడాది డిసెంబరు 4వ తేదీన చేపట్టిన ఆపరేషన్‌ ట్రైడెంట్‌లో.. నేవీలోని కిల్లర్‌ స్క్వాడ్రన్‌ రంగంలోకి దిగింది. అందులోని క్షిపణి నౌకలు.. కరాచీలోని పాక్‌ యుద్ధనౌకలు పీఎన్‌ఎస్‌ ముహాఫిజ్, పీఎన్‌ఎస్‌ ఖైబర్, తూర్పు పాకిస్థాన్‌కు మందుగుండు సామగ్రిని తీసుకెళుతున్న ఎంవీ వీనస్‌ అనే నౌకలను ముంచేశాయి. ఈ దాడిలో పీఎన్‌ఎస్‌ షాజహాన్‌ బాగా దెబ్బతింది. కరాచీ రేవులోని చమురు ట్యాంకులూ పేలిపోయాయి. నాలుగు రోజుల తర్వాత ఆపరేషన్‌ పైథాన్‌ పేరిట మరోసారి కరాచీపై భారత నౌకాదళం విరుచుకుపడింది. సరకు రవాణా నౌకలను ముంచేసింది. ఈ దాడుల్లో పాక్‌ నేవీ ఇంధన ట్యాంకర్‌ పీఎన్‌ఎస్‌ ఢాకా తీవ్రంగా దెబ్బతింది. కరాచీలోని ఇంధన నిల్వల్లో 50శాతానికిపైగా నాశనమైంది. మొత్తంమీద 1971 యుద్ధంలో నౌకాదళ చర్యలు భారత విజయానికి దోహదపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *