Exclusive | ఎంక్వైరీ..టెన్ష‌న్‌! కాళేశ్వ‌రంపై విజి‘లెన్స్’ ఫోక‌స్‌

ప్రాజెక్టులో మరో ప్యాకేజీపై విచార‌ణ‌
అనంతగిరి రిజర్వాయర్‌ వివరాలపై ఈఈకి లేఖ
ఇంజినీర్ల నుంచి ఏఈఈల దాకా విచార‌ణ‌లు
కొండ‌పోచ‌మ్మ‌సాగ‌ర్‌, దానికి ఎత్తిపోత ప‌నులపై ఆరా
బ‌స్వాపూర్ రిజ‌ర్వాయ‌ర్‌పైన ద‌ర్యాప్తు మొదులు
ఈఎన్సీతో స‌హా ఆరుగురు అధికారుల‌కు పిలుపు
ప‌రిపాల‌న‌, సాంకేతిక అనుమ‌తులు, ఒప్పందాలేంటి?
బ్యాంకు గ్యారెంటీలు, ఎం బుక్కులు కావాల‌న్న విజిలెన్స్‌
ఒక్కొక్క అధికారి, సిబ్బందితో వ‌రుస‌బెట్టి విచార‌ణ‌లు
మొత్తం 60 మందిని పిలిచి వివ‌రాలు రాబ‌డుతున్న అధికారులు
విచార‌ణ పేరుతో ప‌నుల్లో పాల్గొన్న అధికారుల‌పై ప్రెష‌ర్‌

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ :

కాళేశ్వరం ఎత్తిపోతల (Kaleswaram ) పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో మరో ప్యాకేజీపై విజిలెన్స్ (Vigilance) విచారణ చేపట్టింది. నాలుగో లింక్‌లోని రెండో ప్యాకేజీగా జరిగిన అనంతగిరి రిజర్వాయర్‌ నుంచి నీటిని ఎత్తిపోసే వివరాలను వెంటనే అందజేయాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు (Executive Engineer )లేఖ రాశారు. ఇప్పటికే రెండు ప్యాకేజీల పనులకు సంబంధించి ఇటీవలే విచారణ ప్రారంభం కాగా, ఇప్పుడు మరో ప్యాకేజీపై విజిలెన్స్‌ దర్యాప్తు ప్రారంభించడం నీటి పారుదల శాఖలో సంచలనంగా మారింది. ఒక్కో ప్యాకేజీలో 60 మందికి పైగా ఇంజినీర్లు విచారణకు హాజరు కావాల్సి వస్తోంది. ఒక ప్యాకేజీలో విచారణ ఎదుర్కొన్న వారిలో అత్యధికులు ఇంకో ప్యాకేజీలో కూడా ఉంటున్నారు.

వ‌ర‌ద‌కాలువ‌, మిడ్‌మానేరుపైనా ఫిర్యాదులు..

ఇటీవల కొండపోచమ్మసాగర్‌పైన, (Kondapochamma ) ఈ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పనులపైన, బస్వాపూర్‌ రిజర్వాయర్‌పైన విజిలెన్స్‌ దర్యాప్తు చేపట్టింది. కొండపోచమ్మ పనులపై 8 రోజులపాటు నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్, రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ ఇలా వివిధ విభాగాలకు సంబంధించి ఉన్నత స్థాయి ఇంజినీర్ల నుంచి ఏఈఈల వరకు 60 మందికి పైగా ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. మరోవైపు కాళేశ్వరంతో సంబంధం లేని, వరద కాలువలో భాగంగా నిర్మించిన మిడ్‌మానేరుపై 2021లోనే ఫిర్యాదు వచ్చింది. అయితే.. విచారణ చేపట్టలేదు. ఇటీవల విజిలెన్స్‌ విచారణ మొదలుపెట్టింది. ఇందులో ఈఎన్సీతో సహా ఆరుగురిని విచారణకు పిలిచారు. మిడ్‌మానేరుకు సంబంధించి ఈఎన్సీ జనరల్‌ అనిల్‌కుమార్‌ సోమవారం విజిలెన్స్‌ విచారణకు హాజరైనట్లు తెలిసింది.

ఉన్నతాధికారుల తనిఖీ నివేదికలు

కాళేశ్వరం ఎత్తిపోతల నాలుగో లింకులోని అనంతగిరి రిజర్వాయర్‌ నుంచి సిద్దిపేట జిల్లాలోని చిన్నగుండవల్లి వద్ద గల సిస్టర్న్‌ వరకు చేసిన పనులకు సంబంధించి ప్యాకేజీ రికార్డులన్నీ అందజేయాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాంతీయ అధికారి సిద్దిపేటలోని ఇరిగేషన్‌ డివిజన్‌-2 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీన లేఖ రాసి వారంలోగా రికార్డులన్నీ అందజేయాలని కోరారు. జరిగిన పని, అయిన వ్యయం గురించి సమగ్ర వివరాలు అందజేయాలని, పరిపాలన, సాంకేతిక అనుమతులు, ఒప్పందం, అనుబంధ ఒప్పందాలు, బ్యాంకు గ్యారంటీలు, ఎం.బుక్కులు, డిజైన్లు, గ్రామాల వారీగా భూసేకరణ వివరాలు, నాణ్యతా రిపోర్టులు, ఉన్నతాధికారుల తనిఖీ నివేదికలు ఇలా మొత్తం 15 అంశాలపై నివేదికలు కోరారు.

ఇన్‌చార్జిగా ఉన్న ఈఈపైనే విచార‌ణ‌..

ప్రస్తుతం లేఖ అందుకొన్న ఈఈని విజిలెన్స్‌లో నియమించాలని నీటిపారుదల శాఖ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం విజిలెన్స్‌లో ఈఈగా ఉన్న ప్రసాద్‌ను మార్చి కొత్త ఈఈను నియమించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించారు. కానీ, ఇప్పుడు అదే ఈఈ ఇన్‌చార్జిగా ఉన్న ప్యాకేజీపై విచారణకు విజిలెన్స్‌ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *