Ex-Servicemen | సాయుధ దళాల సేవలు అజరామరం..
Ex-Servicemen | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన సైనికుల సేవలు వెలకట్టలేమని సాయుధ దళాల నిధికి తోచిన సహాయం మాజీ సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని ఆదివారం స్థానిక కలెక్టర్(Collector) కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఇంచార్జ్ కలెక్టర్ ఇలక్కియ సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుండి పతాకాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో సైనికులకు మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ రక్షణకై పోరాడి ఆసువులుబాసిన సైనికుల నివాళులు అర్పిస్తున్నాను. దేశ గౌరవాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో దైర్యంగా పోరాడి వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే సంకల్పంతో 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ (December) 7వ తేదిన సాయిధ దళాల పతాక దినోత్సవాన్ని పాటిస్తున్నాం. భారత సైనికులు మొక్కవోని దీక్షతో చూపుతున్న దేశభక్తి, సాహసం త్యాగాల పట్ల దేశం గర్విస్తుందన్నారు. పాకిస్తాన్, చైనాలతో జరిగిన, కార్గిల్ యుద్ధ పోరాటం ముంబై తాజ్ హోటల్ పై దాడి ఇటీవల కాశ్మీర్ లో పర్యాటకుల పై ముష్కరుల దాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ వంటి సంఘటనలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత జవానుల దైర్యసహసాలు తెగువకు జాతి యావత్తు గర్విస్తుందన్నారు.
ఆయా సమయాలలో ఎంతో మంది జవానులు వీరమరణం పొందరన్నారు. నేడు మనం స్వేచ్చగా జీవించగలుగుతున్నాం అంటే.. అందుకు కారణం మన సైనికుల రక్షణే. దేశ రక్షణలో పాటుపాడుతున్న ప్రతి సైనికునికి మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. వారి రుణం తీర్చుకునే అవకాశం పతాక దినోత్సవం కల్పించిందన్నారు. వీర మరణం పొందిన సైనికుల తల్లిదండ్రులు (Parents) వితంతువులు అయిన భార్య పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి జిల్లా ప్రజలు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, విద్యాసంస్థలు విరివిగా విరాళాలు అందించాలని ఇలాక్కీయ పిలుపు ఇచ్చారు.
జిల్లా సైనిక సంక్షేమ అధికార సర్జస్ లెఫ్టనెంట్ కమాండర్ కె. కళ్యాణ వీణ మాట్లాడుతూ… యుద్ధ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, వికలాంగులైన వారి సంరక్షణకు సామాజంలో ప్రతి ఒక్కరూ సహాయం అందిస్తే గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు అండగా ఉన్నట్లవుతుందన్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్ (cancer) జాయింట్ రీప్లే స్మెంట్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాదపడుతూ చికిత్స చేయించుకోలేని మాజీ సైనికులకు ఈ విరాళం ద్వారా సహాయం అందించే అవకాశం ఉందన్నారు. నిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని, స్వచ్చందంగా విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చేవారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, ఎన్టీఆర్ జిల్లా పేరున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా 62067742138 నెంబర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బిఐఎన్ 0020899 ద్వారా నేరుగా తమ విరాళాలు అందించవచ్చునని ఆమె తెలిపారు. నగరానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాళీ ప్రసాద్, ప్రతి ఏడాది సాయుధ దళాల పతాక నిధికి విరాళం యిచ్చినట్లే ఈ ఏడాది కూడా 25 వేల రూపాయలు ఇంచార్జ్ కలెక్టర్ ద్వారా అందజేసినందుకు ధన్యవాదాలు తెలిజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది, సైనిక సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, మాజీ సైనికులు వారు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

