దండకారణ్యంలో భీకర పోరు.. సుక్మాలో ఆయుధగారం స్వాధీనం
ఆంధ్రప్రభ, చింతూరు (ఏఎస్ఆర్ జిల్లా)
మావోయిస్టు కీలక నేతలు ఆయుధాలతో సహా లొంగుబాట పట్టిన కొన్ని రోజులకే.. మళ్లీ దండకారణ్యంలో తుపాకులు గర్జించాయి. వరుస రెండు రోజులుగా భీకర ఎన్ కౌంటర్ జరుగుతోంది. బుధవారం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా.. గురువారం మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ లో కీలక నేతలు మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర కమిటీ సభ్యురాలు రామ్ ధర్ అంగరక్షకురాలు సునీతక్క ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎదుట తన ఆయుధంతో సహా లొంగిపోయింది. ఆమె నుంచి కీలక సమాచారంతో భద్రత దళాలు మళ్లీ దండకారణ్యంలో జల్లెడ పట్టినట్టు ప్రచారం జరుగుతోంది. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని అన్నారం.. –మారిమల అడవుల్లో ఈ భీకర ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. తాజాగా గురువారుం ఉదయం జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఆరు నెలలపాటు ఆయుధాలు పట్టేది లేదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించిన 48 గంటల్లోపే తెలంగాణ -ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో బుధవారం ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. అన్నారం – మరిమల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు భధ్రతా బలగాలకు సమాచారం వచ్చింది. కూంబింగ్ చేస్తున్న బలగాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. భధ్రతాబలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. కొన్ని గంటలపాటు మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులు నేలకొరిగారు. ఎన్ కౌంటర్ స్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు భద్రత దళాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
మావోయిస్టుల ఆయుధగారం స్వాధీనం
సుక్మా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనంఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు ఆయుధాలను తయారు చేసే ఫ్యాక్టరీని బలగాలు ధ్వంసం చేశాయి. జిల్లాలోని గోంగూడ- కంచాల అడవుల్లో మావోయిస్టుల కోసం ఆపరేషన్ చేపట్టిన బలగాలు ఓ రహస్య ప్రాంతంలో బెటాలియన్ నంబర్-1కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతం నుంచి 17 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు, ఆయుధ తయారీ సామగ్రి, పరికరాలను స్వాధీనం చేసుకొని.. ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. ఈ ఘటనను ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు.

