హైదరాబాద్, ఆంధ్రప్రభ : టిపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాళేశ్వరంపై విచారణకు రమ్మని నోటీసులు రాగానే శామీర్ పేటలోని ఓ ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రహస్యంగా సమావేశమయ్యారని, ఈ మంతనాలెందుకు అని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై శనివారం హరీశ్ రావు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. విలువలకు తిలోదకాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే మీరూ నడుస్తున్నారని పీసీసీ చీఫ్ పై ధ్వజమెత్తారు
తమ పార్టీని వీడిన నాయకులను ఎన్నడూ వ్యక్తిగతంగా కలిసింది లేదని హరీశ్రావు స్పష్టం చేశారు. తానెప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప తమ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడనని అన్నారు. ఇకనైనా ఇలాంటి ఆరోపణలు మానుకుని స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని చురకలంటించారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై దృష్టిపెట్టాలని టిపిసిసి ఛీప్ కు సూచించారు.