HYD | ఏనుగు దంతాల అక్రమ రవాణా… నిందితుడి అరెస్ట్ !

  • రూ.3 కోట్ల విలువైన రెండు ఏనుగు దంతాల స్వాధీనం
  • పరారీలో మరొక నిందితుడు

నాగోల్‌, (ఆంధ్రప్రభ) : తిరుపతి శేషాచలం అడవులలో సేకరించిన ఏనుగు దంతాలను హైదరాబాదులో విక్రయించడానికి వస్తున్న నిందితులను ఎల్బీనగర్‌ ఎస్‌ఓటి, హయత్‌నగర్‌ అటవీశాఖ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వారి వద్ద నుండి 5.62 కిలోల బరువున్న అంతర్జాతీయ మార్కెట్లో మూడు కోట్ల విలువైన రెండు ఏనుగు దంతాలను ఒక సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

కేసుకు సంబంధించి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌ బాబు ఎల్బీనగర్‌ సిపి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, అన్నమయ్య జిల్లా, ఉత్తర ఎగువ కొత్తపల్లి, ఎండపల్లి, రాయచోటికి చెందిన రేకులకుంట ప్రసాద్‌ (32) జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసై గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో నిందితుడు.

ఇతడు ఫిబ్రవరి 2025 లో తిరుపతి సబ్‌ జైల్లో శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలోనే ఇతనికి సబ్‌ జైల్లోనే రాయచోటికి చెందిన మరో నిందితుడు లోకేశ్వర్‌ రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ జైల్లో ఉన్నప్పుడే ఏనుగు దంతాల అక్రమ రవాణాకు ప్లాన్‌ వేశారు.

జైలు నుండి విడుదల అయినాక వారి పథకాన్ని అమలు చేశారు. వీరిద్దరూ తిరుపతి జిల్లా శేషాచలం అడవికి వెళ్లి అక్కడి యానాదుల గిరిజనుల నుండి (2) ఏనుగు దంతాలను తక్కువ ధరకు సేకరించారు. వాటిని హైదరాబాదులో ఎక్కువ ధరకు అమ్మమని ప్రసాదుకు అప్పగించారు.

వారిద్దరూ అక్రమంగా సంపాదించిన ఏనుగు దంతాలతో ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఎక్కి హైదరాబాద్‌ లో విక్రయించడానికి బయలుదేరారు. బుధవారం ఉదయం బస్సులో ఎల్బినగర్‌ చేరుకున్నారు. పక్క సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ ఎస్‌ఓటి బృందం హయత్‌ నగర్‌ అడవి శాఖ అధికారులు కలిసి నిందితుడు రేకులకుంట ప్రసాద్‌ను ఎల్బీనగర్‌ వద్ద అరెస్టు చేశారు.

మరో నిందితుడు లోకేశ్వర్‌ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడనని సీపీ పేర్కొన్నారు. త్వరలో అతని కూడా అరెస్టు చేస్తామని సీపీ అన్నారు. అరెస్ట్‌ అయిన ప్రసాద్‌ గత నేర చరిత్రను కూడా ధ్రువీకరించామని వారు సూచించారు. అంతరించిపోతున్న జంతువుల ప్రాణాలను రక్షించడంలో ఎలాంటి ఆలోచన లేకుండా ముందుకు సాగుతామని అలాంటి దుచర్యలకు పాల్పడుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఎల్బీనగర్‌ ఎస్‌ ఓ టి పోలీసులను, హయత్‌ నగర్‌ అడివిశాఖ అధికారులను సీపీ సుధీర్‌ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎండి షాకీర్‌ హుస్సేన్‌, హయత్‌నగర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సాయి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply