AP | ఇంద్ర‌కీలాద్రిపై సెప్టెంబ‌ర్ 22 నుంచి ద‌స‌రా మ‌హోత్స‌వాలు : ఈవో వీకే శీనానాయ‌క్‌

  • అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు 11రోజుల పాటు వైభ‌వంగా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌..
  • 11రోజులు.. 11 అలంకారాలు…
  • 10 సంవత్సరాల తర్వాత కాత్యాయని దేవి అవతారం…
  • మూలా నక్షత్రం రోజున సీఎం పట్టు వస్త్రాలు సమర్పణ…


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : దేశ విదేశాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి కనకదుర్గమ్మ (Kanakadurgamma) వారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వీకే శినా నాయక్ (Seenanayak) ప్రకటించారు. ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను సెప్టెంబ‌ర్ 22వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

సెప్టెంబ‌ర్ 22 నుంచి ఇంద్ర‌కీలాద్రిపై నిర్వ‌హించ‌నున్న ద‌స‌రా మ‌హోత్స‌వాల (Dasara Celebrations) నిర్వ‌హ‌ణ‌పై సోమ‌వారం కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి వీకే శీనానాయ‌క్.. వైదిక క‌మిటీ స‌భ్యులు, వేద‌పండితుల‌తో క‌లిసి మీడియా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన ప‌త్రిక‌ను విడుద‌ల చేశారు. అనంత‌రం ఈవో మాట్లాడుతూ… శ్రీ విశ్వావ‌సు నామ సంవ‌త్స‌ర ద‌స‌రా మ‌హోత్స‌వాల‌ను సెప్టెంబ‌ర్ 22నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని వైదిక క‌మిటీ నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ద‌స‌రా మ‌హోత్స‌వాల‌కు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాలు, దేశ‌విదేశాల నుంచి పెద్దఎత్తున భ‌క్తులు అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తార‌న్నారు. భ‌క్తుల మ‌నోభావాల‌కు అనుగుణంగా సాధార‌ణ భ‌క్తుల‌కు అమ్మ‌వారి ద‌ర్శ‌నం త్వ‌రిత‌గ‌తిన జ‌రిగేలా ఏర్పాట్లు చేసేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దేవాదాయ శాఖ మంత్రి, క‌మిష‌న‌ర్, ఇత‌ర ఉన్న‌తాధికారుల సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ద‌స‌రా ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

11 అలంకరణల్లో అమ్మవారు…

ఈ ఏడాది నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో కనకదుర్గమ్మ వారు 11 అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ స్థానాచార్యులు విష్ణుభ‌ట్ల శివ ప్రసాద్ శర్మ తెలిపారు. అమ్మవారి అలంకరణ విషయాలపై ఆయన మాట్లాడుతూ… ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల్లో భాగంగా శ్రీ విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రంలో నిర్వ‌హించే ఉత్స‌వాల్లో అమ్మ‌వారు 11 రోజుల‌పాటు 11 అవ‌తారాల్లో
భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌న్నారు.

22వ తేదీన ఆశ్వీయుజ శుద్ధ పాడ్య‌మి నాడు అమ్మ‌వారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని..
23వ తేదీన శ్రీ గాయత్రీ దేవి
24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి
25వ తేదీన శ్రీ కాత్యాయ‌ని దేవి
26వ తేదీన శ్రీ మహాలక్ష్మీ దేవి
27వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
28వ తేదీన శ్రీమహా చండీ దేవి
29వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి
30వ తేదీన శ్రీ దుర్గాదేవి
అక్టోబ‌ర్ 1న శ్రీ మహిషాసురమర్దినీ దేవి
అక్టోబ‌ర్ 2న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిస్తార‌ని వివ‌రించారు.

మూలా న‌క్ష‌త్రం రోజున రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌న్నారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. ఏటా మాదిరిగానే అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తామ‌ని, ప్ర‌తిరోజు నగరోత్సవం జ‌రుగుతాయ‌ని శివ ప్ర‌సాద్ శ‌ర్మ, ఆలయ స్థానాచార్య మరియు వైదిక కమిటీ సభ్యులు వివ‌రించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు ఎల్.దుర్గా ప్రసాద్ వైదిక కమిటీ సభ్యులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి, వి ఎస్ మహర్షి ఘనాపాటి వేద పండితులు, వైది కమిటీ సభ్యులు, అర్చకులు శ్రీధర్ శర్మ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇరువురు, ఎఈఒ లు వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply