ఒకరి పై జిల్లా బహిష్కరణ …

ఒకరి పై జిల్లా బహిష్కరణ …

ఇప్పటివరకు 9 మంది
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి .
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ .

కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒకరి పై జిల్లా బహిష్కరణ చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా బహిష్కరణకు సంబంధించి కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్నూలు మండలం, బుధవారపేట లో నివాసం ఉంటున్న పోలిశెట్టి అశోక్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఈ వ్యక్తి పై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి ఆదివారం జిల్లా బహిష్కరణ ఉత్తర్వులను జారీ చేశారు.

కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలిశెట్టి అశోక్ పై రౌడీషీట్ ఉంది. క్రిమినల్ కేసులలో నిందితులుగా ఉన్నారు. ఈ వ్యక్తి పై గతంలో తీవ్రమైన నేరాలకు, ముఖ్యంగా హత్యలకు సంబంధించిన కేసుల్లో పాల్గొన్నట్లు గుర్తించినందున , ప్రజల్లో భయాందోళనలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం జిల్లా బహిష్కరణ విధించినట్లు తెలిపారు. పై తెలిపిన కేసుల్లో పలు మార్లు రిమాండ్ కు వెళ్లినప్పటికీ కూడా ఇతడి ప్రవర్తనలో ఎటువంటిమార్పు రాకపోగా, మరి ఎక్కువగా వివిధ రకాల కేసులలో పాల్గొంటున్నారని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనల మేరకు ఇతని క్రిమినల్ రికార్డులను నిశితంగా పరిశీలించిన మీదట జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ… జిల్లాలో ఇప్పటివరకు చెడు నడత కలిగిన తొమ్మిది మంది పై 1)వడ్డే రామాంజనేయులు, 2) పటాన్ ఇమ్రాన్ ఖాన్ 3) వడ్డే తులసి కుమార్ 4) వడ్డే రేవంత్ కుమార్ 5) వడ్డే శివ కుమార్ 6) మిట్టగేరి కుర్వ వెంకటేశ్వర్లు 7) కుర్వ మధు @ పుండుకూర మధు 8) మిట్టగేరి కుర్వ మధసూధన్ @మధు 9) పోలిశెట్టి అశోక్ ల పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలుగజేసే వారి పై ఇలాంటి చర్యలు కొనసాగుతాయని, అరాచక శక్తులుగా మారి, ప్రజలను యభ్రాంతులకు గురిచేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలుగ జేసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అటువంటి వారి పై జిల్లా బహిష్కరణతో పాటు గా పీడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని, ప్రశాంతంగా, మంచిగా, బుద్ధిగా జీవించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఇటువంటి చెడు నడత కలిగిన చాలా మంది పేర్లు జిల్లా బహిష్కరణ పరిశీలనలో ఉన్నాయని, మంచి ప్రవర్తనతో జీవించాలని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.

Leave a Reply