MDK | కలహాలొద్దు.. కలిసి ముందుకెళ్దాం.. నీలం మ‌ధు ముదిరాజ్

ఉమ్మడి మెద‌క్ బ్యూరో : మత్స్యకారులు సభ్యత్వాల విషయంలో కలహాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు పోవాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలు బీసీ డి నుంచి బీసీ ఎ, రాజకీయ, ఉద్యోగ, ఆర్థిక పరమైన విషయాలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని శనివారం హైదరాబాద్ లోని వారి నివాసంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, వివిధ ముదిరాజ్ సంఘ నాయకులతో నీలం మధు కలిశారు. ఈవిషయంలో సానుకూలంగా స్పందించిన వేం నరేందర్ రెడ్డి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు.

అనంతరం నీలం మధు మాట్లాడుతూ… మత్స్యకారులకు సభ్యత్వ నమోదులో పలు సామాజిక వర్గాల మధ్య ఎదురవుతున్న ఇబ్బందులపై స్పందించారు. కలహాలు లేకుండా కలిసి ముందుకు సాగితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో మత్స్య సంపద పెరుగుదలకు లోటులేదని, ప్రతిఒక్కరూ భేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించుకుందామన్నారు. జీవో ఏం ఎస్ 98/1964 ప్రకారం ముందుకు వెళ్తే సమస్య పరిష్కారానికి మార్గం సులువుతుందని అభిప్రాయపడ్డారు. సామాజిక వర్గాల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలతోనే సమస్య ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సభ్యత్వంలో ఎదురవుతున్న ఇబ్బందుల వలన హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఫైవ్ మెన్ కమిటీ ముందు ప్రతి ఒక్కరూ బేదాభిప్రాయాలు లేకుండా తమ వాదనను వినిపించాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులందరికీ న్యాయం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. త్వరలో మత్స్యకార సామాజిక వర్గాలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మన దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. తాము ముందుండి మన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని నాయకులు ప్రకటించారు. ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే రాజకీయ, ఆర్థిక అభ్యున్నతి సాధ్యపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి మన అందరి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఉప్పరి నారాయణ, చొప్పరి శంకర్, డీఎల్ పాండు, నీలకంఠం, ప్రభాకర్, గుండ్లపల్లి శ్రీనివాస్, బలరామ్, రమేష్, మద్దెల సంతోష్, గొడుగు శ్రీను, సురేందర్, లక్ష్మణ్, యాదగిరి, శివ, సుంకరబోయిన మహేష్, సతీష్, అశోక్, మాణిక్యరావ్, నారబోయిన శ్రీనివాస్, రాములు, ముదిరాజ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *