మెదక్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత పథకంలో భాగంగా ఆందోల్ – జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్ లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు సన్న బియ్యంను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇండ్లను, ఇండ్ల స్థలాలను అందజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 85 లక్షల మంది లబ్ధిదారులకు ఒక కోటి 81లక్షల 696 మెట్రిక్ టన్నుల సన్నబియాన్ని ప్రతి కుటుంబంలోని సభ్యులకి 6 కిలోల చొప్పున సన్న బియ్యంను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని 846 చౌక ధరల దుకాణాల ద్వారా 3లక్షల 78, 728 తెల్ల రేషన్ కార్డులు, అందులో 26, వేల 115 అంత్యోదయ కార్డులు, 100 అన్నపూర్ణ కార్డుల ద్వారా 12 లక్షల 32,274 మంది సభ్యులకు సన్నబియ్యం పంపిణీ ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి వెల్లడించారు.
ఆహార భద్రత కార్డులోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ఆరుకిలోల చొప్పున, అంత్యోదయ కార్డు ఒక్కంటికి 35కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డు ఒక్కంటికి 10 లోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులందరికి నాణ్యమైన బియ్యాన్ని అందజేస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, అంబదాసు, నియోజకవర్గ నాయకులు సురేందర్ గౌడ్, స్ధానిక ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.