ADB | బాసర అమ్మవారి సన్నిధికి పోటెత్తిన భక్తజనం

బాసర, మే 30 (ఆంధ్రప్రభ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం పర్వదినం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుండి భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు అమ్మవారి సన్నిధిలోని అక్షరాభ్యాస మండపాల్లో ఆలయ అర్చకులచే తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను జరిపించారు.

మధ్యాహ్నం భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు వేలాదిగా తర‌లి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. సుమారు పదివేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్షరాభ్యాస పూజలు, ప్రసాదాలు, ఇతర అమ్మకాల ద్వారా ఆలయానికి 10 లక్షల రూపాయల ఆదాయం సమకూర‌నున్న‌ట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *