శ్రీశైలంలో భక్తుల కిటకిట…

ఘనంగా కార్తీక మహోత్సవాలు

వేకువ జాము నుంచే దర్శనం ప్రారంభం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.కార్తీకమాసంలో మూడవ సోమవారము భక్తులు వేకువజాము నుండే అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అలాగే వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకుంటున్నారు. కార్తీకమాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు మరియు కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోందని నిర్వాహకులు తెలుపుతున్నారు.

భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీశైలం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామన 4.30 గంట ల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలను కొనసాగించడం జరుగుతోందన్నారు.. అదేవిధంగా తిరిగి సాయంత్రం 5.30గంటల నుంచి దర్శనాలు కొనసాగుతాయన్నారు. అదేవిధంగా కార్తీకమాస రద్దీరోజులలో అనగా శని, ఆది, సోమవారాలు శుద్ధఏకాదశి, కార్తీక పూర్ణిమ మొదలైన రోజులు కార్తీకమాసములో మొత్తం 16 రోజులు స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయబడిందన్నారు. ఈ రద్దీరోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలుపుదల చేయడం జరిగినదన్నారు.

..భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయన్నారు.దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారన్నారు.
…కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు ఉదయం నుంచే భక్తులకు వేడిపాలను కూడా అందజేయడం జరిగిందన్నారు. భక్తులకు అల్పాహారంగా పులిహోర, పెరుగన్నం కట్టుపొంగలి, మంచినీరు మరియు బిస్కెట్లు అందజేయబడుతున్నాయన్నారు.
….భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి మరియు గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
…భక్తులకు అన్నప్రసాదవితరణభవనములో ఉదయం 10.30 గంటల నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతున్నాయన్నారు . అలాగే సాయంత్రం 6.39 గంటల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుందన్నారు.
…కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేయబడ్డాయన్నారు. మొత్తం 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేయబడుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఈవో తెలిపారు.

Leave a Reply