నవ జనార్థన ఆలయాలు వివరాలు

తొమ్మిది సంఖ్యతో మానవులకు సంబంధం ఉంది. తల్లి గర్భంలో నవమాసాలు ఉన్న తరువాతనే ఈ జగత్తులోకి ఏడుస్తూ పుడతాడు. ఎందుకంటే ”మళ్ళీ కర్మ బంధంలో చిక్కుకుపోతున్నాను. ఇక ఎప్పటికి జన్మరాహిత్యం కలుగుతుందో? ననే దు:ఖంతో ఏడుస్తూంటాడు. తల్లి కడుపులో ఆ మురికి కూపంలో ఉన్నన్నాళ్ళూ, ”భగవంతుడా! ఎందుకయ్యా! నన్ను మళ్ళీ ఈ మురికి కూపంలోకి పడవేశావు? నాకు నీవే దిక్కు” అంటూ భగవంతుని స్మరణలో (తెలివితోనే) ఉంటుందని గరుడపురాణం, భాగవతం వివరిస్తున్నాయి. మానవుని శరీరంలో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. అవి నోరు, రెండు కళ్ళు, రెండు చెవులు, గుదము (మలవిసర్జకావయవం) మూత్ర విసర్జకావయవం, రెండు నాసికా రంధ్రాలు. మొత్తం తొమ్మిది. మన శరీరంలో నుంచి వాయువు, కాని, ఏ మలిన పదార్థాలు అయినా, ఈ తొమ్మిది మార్గాలు ద్వారానే లోపలికి వెళ్ళడం, బయటకు రావడం జరుగుతుంది.ఆఖరుకు మనిషి ప్రాణం కూడా ఈ తొమ్మిది మార్గాలు ద్వారానే పోతుంది.
భక్త ప్రహ్లాదుడు ఈ కలియుగంలో మానవులు సుఖ సంతోషాలు పొందడానికి ”నవ విధ భక్తి మార్గములు”
ఉపదేశించాడు. మన జీవితం కూడా తొమ్మిది గ్రహాలు నడవడిక మీదే ఆధారపడి ఉంటుంది అని జ్యోతిష్య నిపుణులు, పండితులు అంటున్నారు. అందుకే గ్రహ శాంతి చేసుకొంటూ ఉంటాం. త్రేతాయుగంలో ఒకసారి నారద మహర్షి వైకుంఠ వాసుని దర్శించి, భూలోకంలో ప్రజలలో భక్తి ఎలాఉందో? చూసి వస్తాను స్వామి. నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు. అపుడు స్వామి ”మహర్షీ! లోక సంచారివి. నీకు నేను ప్రత్యేకంగా అనుమతి ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు వెళ్ళి వచ్చి, అక్కడి విశేషాలు నాకు తెలపండి” అనడంతో, నారదమహర్షి ”నారాయణ” అంటూ వచ్చేసాడు. తరువాత భూలోకంలో తిరుగుతూ గోదావరి తీరంలో ఉన్న ధవిళేశ్వరం వద్ధ నున్న సంతాన గోపాలస్వామి గుహకు దగ్గరగా ఉంటూ తపస్సు చేసి కాలంతో పాటు యుగ ధర్మాలు మార్పు చెందుతూ ఉంటున్నాయి. భక్తుల చింతనలు పోగొట్టడానికి, భగవంతునితో బంధం పెచుకోవడమే మార్గం అని ఆలోచించి, ఆ గోదావరి తీరంలో తొమ్మిది స్థలాలలో ఆ వైకుంఠ వాసుని అంశ ”జనార్థన స్వామి” పేరుతో తొమ్మిది ఆలయాలు ప్రతిష్టించినట్లు స్కంద పురాణం చెబుతోంది. ఆ తొమ్మిది జనార్థన స్వామి ఆలయాలనే ”నవ జనార్థన ఆలయాలు” అంటారు.
అవి 1) ధవిళేశ్వరం, 2) కోటిపల్లి, 3) కోరుమిల్లి, 4) మాచర, 5) కపిలేశ్వరపురం, 6) మండపేట ,7) జొన్నాడ, 8) ఆలమూరు, 9) మడికి.
ఈ తొమ్మిది ఆలయాలలో జనార్థన స్వామి, లక్ష్మీ దేవి, భూదేవిలతో కొలువై ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో
భక్త తత్త్వాన్ని పెంపొందించాడు. త్రేతాయుగంలో ప్రతిష్టింపబడిన దేవాలయాలు తరువాత కాలంలో , గ్రామస్థులు సహాకారంతో ఆలయ పునర్నిర్మాణం చేయబడినవి. ఇప్పటికీ ఆ ”నవ జనార్థన స్వామి ఆలయాలు” ప్రజల మనోభీష్టాలను నెరవేర్చుతూ ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ దేవాలయాల్లో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే ”వైఖానస శాస్త్రీయ” ప్రకారం అర్చనలు, అభిషేకాలు పూజలు, కళ్యాణాలు, బ్రహ్మూత్సవాలు జరుగుతాయి. మరో విశేషమేమిటంటే ఈ తొమ్మిది ప్రదేశాలలో ”శివాలయా లు” కూడా ప్రతిష్ట చేయడం ద్వారా, శివకేశవులకు బేధం లేదు అని తెలియ చెప్పడం. సాధారణంగా చుట్టుపక్కల
ఉన్నవారు, ఈ నవ జనార్థన ఆలయాలు దర్శించాలనే కోరిక ఉన్న భక్తులు వెశాఖమాసంలో సందర్శిస్తారని ప్రతీతి. తరువాత కొంతకాలానికి నారద మహర్షి వైకుంఠం వెళ్లి మహావిష్ణువును దర్శించి, ఈ విషయం ఆయనకు తెలియచేసారు. ఇప్పటికీ వెలుగొందుతూ ఉన్న ఈ దేవాలయాలు దర్శించడానికి ఒక చక్కని ప్లాన్‌ వేసుకుని వెళ్ళడమే తరువాయి.

  • అనంతాత్మకుల రంగారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *