న్యూఢిల్లీ , ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లె కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్తో నేటి ఉదయం భేటి అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరానికి రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైనా విజ్ఞప్తి చేశారు. అలాగే బనకచర్ల సాగునీటి పథకానికి అనుమతులతో పాటు నిధులు కూడా ఇవ్వాలని కోరినట్లు సమాచారం .
జీవన్ మిషన్ , రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి సరఫరా ప్రాజెక్టుల ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు, పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చించారు.జల వనరుల సమర్థవంతమైన వినియోగం కోసం కేంద్ర సహకారాన్ని కోరారు.

కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త, మంత్రులుగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు నేడు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే కీలక నేతలు హాజరవుతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.

ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 4: 45 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తోనూ చంద్రబాబు సమావేశం అవుతారు. మిర్చి ధర పతనం కావడంతో కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునేందుకు సహాయం చేయాలని కేంద్రమంత్రిని కోరనున్నారు. దీనిపై కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి లేఖలు రాశారు. అనంతరం సాయంత్రం 5:55 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరుతారు.