హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 23న కేబినెట్ సమావేశం అనంతరం అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు సంభాషనే ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటకతో ఏర్పరచుకున్న స్నేహపూరిత సంబంధాలను ఏపితో కూడా కొనసాగించాలని తన ఆకాంక్షను వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా జలవివాదాలు అలాగే కొనసాగుతున్నాయని రేవంత్ పేర్కొన్నారు. గోదావరి నీటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు.
తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించిన వారిలో నిజాం, కాంగ్రెస్ మాత్రమే ఉన్నారని, కేసీఆర్ ఏదీ నిర్మించలేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో మార్పులు చేయడానికి తెలంగాణ అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాలపై కూడా రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరమని, ఆంధ్రలో తెలుగుదేశం గెలవాలంటే గోదావరి నీళ్లు అవసరమని ఆయన అన్నారు. అదే సమయంలో, తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ తమ రాజకీయ మనుగడ కోసం గోదావరి నీటి సమస్యను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.