పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. సరిహద్దుల్లో నిఘా పెంచడం, అదనపు బలగాలను మోహరించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు దేశ భద్రతా పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమీక్షలు జరుగుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (మంగళవారం) తన నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. రేపు (బుధవారం) భద్రతా వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ (CCS) మరొక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ కీలకమైన సమావేశానికి ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతులు ఈరోజు మోడీ నివాసంలో సమావేశమవడం గమనార్హం. ఈ సమావేశంలో, దేశ అంతర్గత భద్రత, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి గురించి విస్తృతంగా చర్చించారు.
దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వాఖ్యాలు చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం జాతీయ సంకల్పమని ప్రధాని పునరుద్ఘాటించారు. పహల్గామ్ దాడికి తగిన సమాధానం ఉంటుందని ప్రధాని అన్నారు. భారత సాయుధ దళాల సామర్థ్యాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని… ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.