ఢిల్లీ : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కుప్పలు తెప్పలుగా నోట్లకట్టలు బయట పడడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. నివాసంలో భారీ మొత్తంలో భయటపడిన నోట్ల కట్టలు రూ.50కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా ఈ సంఘటన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం, ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో, ఆయనపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించకూడదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అంతేకాక ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ను కూడా నియమించారు. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి సుప్రీంకోర్టు నివేదిక కోరింది.
అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినప్పటికీ, అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకించింది. వారు ఈ బదిలీని తిరస్కరిస్తూ ఒక తీర్మానం చేసినట్లు సమాచారం. కాగా తాజాగా ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. విచారణ తర్వాత పరిణామాలను బట్టి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది.
ఇది న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనంపై చర్చను రేకెత్తించిన అంశంగా మారింది. తాజా పరిణామాలతో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్ ఉపాధ్యాయ సోమవారం జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయ విధుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను సైతం తొలగించారు.