ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : డీసీసీల నియామకాల విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రి ఉత్తకుమార్ రెడ్డి(Minister Uthakumar Reddy) సతీమణి డీసీసీ అధ్యక్ష పదవి కోసం అప్లై చేసినట్లు చెప్పారు. ఈ రోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీ బాధ్యతలు తీసుకోవడం మంచిదన్నారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు డబుల్ పోస్టులుగా చూడం లేదన్నారు. సదరు కుటుంబాలు అంటే అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్(Service) చేస్తుంటే అడ్డంకి ఉండదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఉన్నపలంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరని కరాకండిగా తేల్చి చెప్పారు. తాను పార్టీలో ఉన్నా.. తన కొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరని స్పష్టం చేశారు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు.
పార్టీయే సుప్రీం..
కాంగ్రెస్ పార్టీలో అధిష్టానమే సుప్రీం అని పీసీసీ చీఫ్(PCC Chief) తెలిపారు. డీసీసీ నియామకాల విషయంలో తమ అభిప్రాయాలను సైతం తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తన అభిప్రాయాలను పంపారన్నారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ ల మధ్య గురు శిష్యుల బంధం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా మతం పేరుతో రాజకీయాలు(Politics) చేయడమే కదా అన్నారు.
మతం పేరుతో ఓట్లు దండుకోవడమే ఆ పార్టీ విధానమని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మతం కులం పేరుతో ఓట్లాడుకోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి(Kishan Reddy) సికింద్రాబాద్ కు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి మరో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కో నియోజక అభివృద్ధి జరుగుతోందన్నారు.
జూబ్లీహిల్స్ లో పదేళ్లు వాళ్లే గెలిస్తే ఓటు చేరి ఎవరు చేశారని అన్నారు. ఓట్ చోరీ పై తొలుత ఫిర్యాదు చేసింది రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో మంత్రులు, అధికారులు ఎవరైనా జవాబుదారీ తనంగా ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని దీమా వ్యక్తం చేశారు.

