Counter | తప్పు మీరు చేసి నిందలు నాపైనా… రజనీకి ఇచ్చిప‌డేసిన ఎంపి లావు

న‌ర్సారావుపేట – మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజని వ్యాఖ్యలకు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కౌంటర్ ఇచ్చారు. రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నేనంటే ఆయనకు చాలా కోపమని రజని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా.. రజని వ్యాఖ్యలకు శ్రీకృష్ణదేవరాయులు స్పందించారు.

ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ.. నేనేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారు.. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు. మా వాళ్లకు ఒక న్యాయం, బయటి వారికి ఒక న్యాయం ఉండదు. భూమిమీద ఆరోపణలు చేశారు.. 40ఏళ్లుగా విజ్ఞాన్ విద్యా సంస్థలు నడుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలి అని ప్రభుత్వాన్ని అడగలేదని, అమరావతిలో అనేక విద్యా సంస్థలు భూమికోసం దరఖాస్తు చేసుకున్నాయి. మా వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు లేదు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని అధిక ధర చెల్లించి భూమిని పొందాము. వేలానికి, కేటాయింపునకు మధ్య చాలా తేడా ఉందని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అయినా, ఇదంతా ఆమెతో ఎవరు మాట్లాడించారో నాకు బాగా తెలుసనని టీడీపీ ఎంపీ పేర్కొన్నారు.

మీరేగా క‌ప్పం తీసుకుంది..

క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నానని ఆరోపణలు చేసినట్లు తెలిసింది. ఆ క్రషర్ సంస్థకు నాకు ఎలాంటి బంధుత్వం లేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు ఓ మీడియా రిపోర్టర్ ను తీసుకెళ్లి ఐపీఎస్ ఆఫీసర్ పీ. జాషువాపై ఒత్తిడి తీసుకొచ్చారు. జాషువా ఈ అంశాన్ని మైన్స్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. మైన్స్ విభాగం విపరీతమైన ఫైన్ వేశారు. దీన్ని అడ్డంపెట్టుకొని ఆ క్రషర్ తనకు కప్పం కడితే వదిలేస్తానని నువ్వు చెప్పిన మాట నిజం కాదా? అంటూ శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. మీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే నాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి జాషువా స్టేట్మెంట్, ఇతర అధికారుల స్టేట్మెంట్లు కూడా ఉన్నాయని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

నాకు బూతులు రావు

నేను వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అందుకే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. నాకు బూతులు చేతకావు.. రజని మాదిరిగా అబద్ధాలు చెప్పలేను. ఈ వ్యవహారాన్ని మొదలు పెట్టింది మీరే. ఇప్పుడు దీనిని మరింత ముందుకు తీసుకెళ్తున్నానని అన్నారు. ఈ క్రమంలో చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని రజని తిరిగి ఇవ్వలేదని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.

రాయ‌బారిని పంపారుగా..

పదిరోజుల క్రితం ఒక మధ్యవర్తిని నా దగ్గరికి పంపించి ఈ కేసును ఆపమని రాయబారం నడిపిన మాట నిజం కాదా..? ఆ స్టోన్ క్రషర్స్ కి డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పిన మాట నిజం కాదా..? అంటూ శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. తప్పులు చేసిందంతా చేసి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలా అంటూ రజనిని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *