కర్నూలు బ్యూరో : గత నెల మార్చి 20నుండి 23 వరకు అహ్మదాబాద్లో జరిగిన జాతీయ టెన్నిస్ క్రీడల్లో పాల్గొని రెండు బంగారు పతకాలు సాధించిన ఇండియన్ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్ ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ టెన్నిస్ మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్ ను సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు అభినందించి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… షేక్ జఫ్రీన్ మార్చి 20నుండి 23 వరకు అహ్మదాబాద్లో జరిగిన జాతీయ క్రీడల్లో పాల్గొని మహిళల సింగిల్స్ విభాగంలో బంగారు పతకం సాధించారని, అదే విధంగా నంద్యాలకు చెందిన సాయి చందన్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించడం అభినందించాల్సిన విషయమన్నారు. తద్వారా 2025 నవంబర్ నెలలో జపాన్లో జరగనున్న బధిరుల ఒలింపిక్స్లో పాల్గొనడానికి ఆమె అర్హత సాధించారని, భవిష్యత్తులో మరింత ప్రతిభ చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డి ఆర్ ఓ సి. వెంకట నారాయణమ్మ, డిసిఓ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.