Collector | పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు…

Collector | పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు…
Collector | గద్వాల (ప్రతినిధి) ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు అధికారులు, ఇతర సిబ్బంది పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. గోనుపాడు గ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లోనీ 77 వార్డుల్లో 189 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ అధికారులకు సహకరించేందుకు రిటర్నింగ్, జోనల్ అధికారులు, మున్సిపల్, పోలీస్ యంత్రాంగం ఇతర సిబ్బంది కలిపి సుమారు 2000 మంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్ల లో, వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి కూడా పోలింగ్ ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోలింగ్ అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఏమైనా సమస్యలు వస్తే వెంటనే జిల్లా ఎన్నికల యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.

సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తును నియమించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ ఆయా విధులు నిర్వహిస్తున్న అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూట్లవారీగా గద్వాల మున్సిపాలిటీలోని 37 వార్డులకు సంబంధించి ఏర్పాటుచేసిన కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారులు తమకు ఇచ్చే పోలింగ్ సామాగ్రిని చెక్ లిస్ట్ లో సరిచూసుకోవాలని, ఏమైనా సామాగ్రి లేకుంటే వెంటనే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకొస్తే ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఆయా పోలింగ్ స్టేషన్లకు వెళ్లాక ఇబ్బంది పడకుండా పోలింగ్ నిర్వహణకు అవసరమైన ప్రతి ఒక్క వస్తువును ప్రీసైడింగ్ అధికారులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. స్పెషల్ కౌంటర్లో బ్యాలెట్ పేపర్స్ తో పాటు పోలింగ్ కు అవసరమైన వివిధ ఫారాలను, కవర్లను, ఇతర సామాగ్రిని పరిశీలించి తగు సూచనలు చేశారు. పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రిపోర్టింగ్ చేశాక రూట్ వారీగా సంబంధిత పోలింగ్ స్టేషనులకు మెటీరియల్ తో వెళ్లేందుకు జోనల్ అధికారులు సహకరిస్తారన్నారు. ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది సాయంత్రంలోగా తమకు కేటాయించిన ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రానికి వచ్చే ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచే వరకు రిటర్నింగ్ అధికారులకు సహకరించాలన్నారు.
అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలోనే ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమును ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాటుచేసిన నాలుగు హాల్స్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిఎస్పి మొగిలయ్య, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, తహసిల్దార్ మల్లికార్జున్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
