హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వనపర్తి పర్యటనలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు.
ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటగా, ఉదయం 11.30 గంటలకు వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడం ద్వారా.. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక పాఠశాలను సందర్శిస్తారు. ఆ తరువాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని, పార్టీ ముఖ్యులు, తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం, రుణ మేళా, ఉద్యోగ మేళాల్లో పాల్గొనడం జరగనుంది.
ఈ కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4.15 గంటలకు వనపర్తి నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరతారు.