ఇద్దరు గార్డులకు తీవ్ర గాయాలు
బోయినపల్లి అటవీ ప్రాంతంలో ఘటన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
తిరుపతి – తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించాయి. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో ఏనుగులు నేడు హల్చల్ చేశాయి. ఈ మేరకు స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన అటవీశాఖ సిబ్బంది.. డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల గుంపును గుర్తించిన అటవీశాఖ సిబ్బంది వాటిని అడవిలోనికి తరిమేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అటవీశాఖ సిబ్బందిపై ఏనుగులు తిరగబడ్డాయి. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు.
ఈ దాడి ఘటనలో ఎలిఫెంట్ టాస్క్ఫోర్స్ సిబ్బంది గాయపడ్డారు. సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్కు కూడా గాయాలయ్యాయి. బోయినపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో ఉస్తికాయలపెంట, కోటకాడ పల్లి, యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.