Chhattisgarh Encounter | 30కి చేరిన మృతుల సంఖ్య …. కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్ ఖగార్

ఛత్తీస్ గడ్ – మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ – దంతేవాడ జిల్లా సరహిద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ – దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు జాయింట్ టీమ్ బయలుదేరింది. ఆపరేషన్ సమయంలో భద్రతబలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఉదయం 7 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించగా.. ఘటనస్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. బీజాపుర్‌ ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక, ఇదే సమయంలో కాంకెర్‌ జిల్లాలోనూఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడ డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. రెండు జిల్లాల్లోనూ ప్రస్తుతం యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పద్దెనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగులుతోంది. ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ దూకుడుగా కొనసాగుతోంది.

Leave a Reply