Chennai | సంస్కృతిని దెబ్బ‌తీసే కుట్ర – ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పెను ముప్పు : సీఎం స్టాలిన్

డీలిమిటేషన్​కు తాము వ్యతిరేకం కాదు
దక్షిణాదికి మాత్రం అన్యాయం చేయొద్దు
అలా చేస్తే లోక్​సభలో ప్రాతినిథ్యం తగ్గుతుంది
అక్కడ మన వాణి వినిపించడం కష్టం
ప్రజామోదం లేని నిర్ణయాలు జరుగుతాయి
విద్యార్థులకు అవకాశాలు ద‌క్క‌కుండా పోతాయి
రైతులకు గిట్టుబాటు ధర రాదు
నిధుల కోసమూ పోరాటం చేయాల్సిందే
ప్రజాస్వామ్యంలో ప్రజలకు అధికారం ఉండదు
అఖిల‌ప‌క్ష‌ భేటీలో తమిళనాడు సీఎం స్టాలిన్
స‌మావేశానికి హాజ‌రైన పిన‌ర‌యి విజ‌య‌న్‌, రేవంత్‌, కేటీర్‌, భ‌గ‌వంత్‌మాన్‌, డీకే శివ‌కుమార్‌
అన్ని పార్టీల అభిప్రాయాలు సేక‌రించిన స్టాలిన్‌
కేంద్రానికి నివేదిక అందిస్తామ‌ని వెల్ల‌డి

చెన్నై, ఆంధ్రప్రభ : బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ద‌క్షిణాది రాష్ట్రాల‌ను అణ‌చివేయాల‌ని చూస్తోంద‌ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. కేటాయింపుల నుంచి విప‌త్తు సాయం దాకా అన్నింటా వివ‌క్ష ఉంద‌ని మండిప‌డ్డారు. తాజాగా డీలిమిటేష‌న్ పేరుతో ద‌క్షిణాది రాష్ట్రాల‌ను రాజ‌కీయంగా స‌మాధి చేసేందుకు రెడీ అయ్యార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్‌లో డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన స‌ద‌స్సులో దక్షిణాది రాష్ట్రాల సీఎంల‌తో పాటు ఉత్త‌రాది నేత‌లు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ మ‌ల్లు ర‌వి, బీఆర్ఎస్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజ‌ర‌య్యారు. పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ సింగ్ మ‌న్, కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్, క‌ర్నాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ త‌దిత‌రులు వ‌చ్చారు.

సంస్కృతి, గుర్తింపు దెబ్బ‌తింటాయి..

ఈ స‌మావేశంలో సీఎం స్టాలిన్ ప్రారంభ ఉప‌న్యాసం చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా దేశం ఏర్పడిందన్నారు. భారత సమాఖ్యను కాపాడటానికి ఇది ముఖ్యమైన రోజు అని.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డీలిమిటేషన్ సొంత దేశంలో వారిని శక్తిహీనులుగా చేస్తుందన్నారు. మన సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందన్నారు. ఇది సంఖ్యల గురించి కాదు.. ఇది అధికారం గురించి అని పేర్కొన్నారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని.. అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందని అభిప్రాయ‌ప‌డ్డారు.

అలా జ‌రిగితే రాజ‌కీయ మ‌నుగ‌డే ఉండ‌దు..

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మనం ఐక్యంగా ఉన్నామని.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బ‌తీస్తోంద‌ని స్టాలిన్‌ అన్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల‌ పునర్నిర్మాణం ఆమోదయోగ్యం కాదన్నారు. దీంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు రాజ‌కీయ మ‌నుగ‌డే ఉండ‌ద‌న్నారు. కేంద్రం సూచన‌లు పాటించి జ‌నాభా నియంత్ర‌ణ చేసిన సౌత్ రాష్ట్రాల‌కు కేంద్రం ఇస్తున్న షాక్ ఇద‌న్నారు. మంచి మ‌నం చేస్తే.. దానికి మ‌న‌ల్ని కేంద్రం శిక్షించేందుకు పావుల‌ను క‌దుపుతున్న‌ద‌ని అన్నారు.. దీనికి అంగీక‌రిస్తే ఇక కేంద్రం చెప్పిన‌ట్లే మ‌నం అంతా త‌ల ఊపాల్సిందేన‌ని అన్నారు.. దీనిపై అంద‌రి అభిప్రాయాల‌ను తీసుకుని కేంద్రానికి సూచ‌న‌లు ఇచ్చేందుకే ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్టు స్టాలిన్ స్ప‌ష్టం చేశారు.

పునర్విభజనకు వ్యతిరేకం కాదు

నియోజకవర్గ‌ పునర్విభజన న్యాయబద్ధంగా జరిగే వరకూ తమ పోరాటం ఆగదని సీఎం స్టాలిన్ అన్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన జరగకూడదనిచ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఏ చర్యనూ తాము వ్యతిరేకించట్లేద‌న్నారు. ఇది న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేయకూడద‌ని, ఈ నిరసన నియోజక పునర్విభజనకు వ్యతిరేకంగా కాదన్నారు. న్యాయబద్ధంగా పునర్విభజన జరగాలని స్టాలిన్ చెప్పారు. దీని కోసం రాజకీయ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తీర్మానాన్ని ప్రతిపాదించారు. స‌మావేశానికి హాజ‌రైన ప్ర‌తినిధులు అంతా దీనికి ఆమోదం తెలిపారు. కాగా, ఈ సమావేశంలో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన 14 మంది రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఏపీ నుంచి ఒక్క పార్టీ కూడా త‌మ‌ ప్రతినిధుల‌ను పంప‌లేదు.. అలాగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ స‌మావేశానికి దూరంగా ఉన్నారు.

తమిళనాడు బీజేపీ ధర్నా..

తమిళ నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై నల్ల షర్టు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో వాస్తవ సమస్యలను పట్టించుకోకుండా డీఎంకే రాజకీయ నాటకానికి తెరతీసిందన్నారు. రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్‌లో స్కామ్‌, మహిళలకు ఎదురవుతున్న వేధింపులు, ఇతర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డీఎంకే యత్నిస్తోందని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *