ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. పెద్దకోర్మ (నయాపర) గ్రామానికి చెందిన ముగ్గురు బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు.
ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం.
“మావోయిస్ట్ ఉద్యమం చివరి క్షణాల్లో ఉంది. వారి నాయకత్వం విచ్ఛిన్నమై, నిరాశకు గురైంది. దండకారణ్యం జోన్లో కేవలం 300 మంది సాయుధ కార్యకర్తలు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు లొంగిపోవాలి లేదా నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధం కావాలి” అని బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పట్టిలింగం అన్నారు
ఈ నెల ప్రారంభంలో బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను హతమార్చిన విషయం తెలిసిందే. ఇది ఆపరేషన్ కగార్లో పెద్ద పురోగతి. సుధాకర్పై ఇప్పటికే రూ. 40 లక్షల రివార్డు ప్రకటించారు. దట్టమైన అబుజ్మద్ అడవులలో సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబల కేశవ్ రావును చంపిన తర్వాత.. సుధాకర్ను సైతం మట్టుబెట్టారు. 1970 నాటి నుంచి మావోయిస్టు ఉద్యమంలో అనుభవజ్ఞుడైన కేశవ్రావుపై రూ. 1.5 కోట్ల బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే.