Chandrababu | అతివేగానికి బ్రేకులేద్దాం

Chandrababu | అతివేగానికి బ్రేకులేద్దాం

అమరావతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్రంలో రహదార్లలో వాహనాల అతివేగాన్ని నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోడ్డు ప్రమాదంపై థర్డ్‌ పార్టీ ద్వారా ఆడిటింగ్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వేగ నియంత్రణ ఎలా అన్నదానిపై పలు అంశాలను ముఖ్యమంత్రి సూచించారు.

రహదారి ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా, లేక రోడ్డు ఇంజనీరింగ్‌ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్‌ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రోడ్‌ సేప్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రవాణా శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, రోడ్‌ సేప్టీ అథారిటీ, రవాణాశాఖ, జాతీయ రహదారులు, పురపాలక తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్‌ సేప్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్‌ స్పాట్లను సరిదిద్దటం, ప్రమాదాలను నివారించేలా క్రాష్‌ బారియర్లు, డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రతి మూడు నెలలకు ఈ అంశాలపై పురోగతిని సమీక్షించుకునేలా రోడ్‌ సేప్టీ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

నిబంధనల మేరకు స్పీడ్‌ గవర్నర్లు

అతి వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో స్పీడ్‌ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రవాణేతర వాహనాలకు వీటిని ఏర్పాటు చేసే అంశంపై ఆలోచన చేయాలన్నారు. వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇరువైపుల ప్రతీ అర కిలోమీటరు పరిధిని కవర్‌ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారులు, ఆర్‌ అండ్‌ బీ అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.

వీటిని ఆర్టీజీఎస్‌తో అనుసంధానించటంతో పాటు వెహికిల్‌ ట్రాకింగ్‌ కోసం ఓ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖకు సూచనలిచ్చారు. హెచ్చరికలు జారీ చేసినా అమిత వేగంగా ప్రయాణించే వాహనాలను సీజ్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు నెలల్లో వేగ నియంత్రణపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు కమిటీ మార్గ నిర్దేశాల మేరకు అన్ని చర్యలూ చేపట్టాలని సీఎం సూచనలిచ్చారు. డ్రైవర్ల శిక్షణకు కూడా ఆధునిక డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

దర్శి, ఆదోని డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోడ్‌ సైన్లు, రహదారుల పై బ్లాక్‌ స్పాట్లను సరిచేయటం, పాద చారులకు సదుపాయాలు, మార్కింగ్‌ లు ఏర్పాటు చేయాలని అన్నారు. జాతీయ రహదారుల పై ఉన్న 680 బ్లాక్‌ స్పాట్లను సరిదిద్దాలని సీఎం ఆదేశించారు.

టూవీలర్స్‌ ప్రమాదాలే ఎక్కువ..

ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందటం ఆందోళనకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఇందులో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవేనని, 53 శాతం మేర ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనదారుల సెల్ఫ్‌ యాక్సిడెంట్లు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

రహదారి ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉండటంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, తిరుపతి, పలనాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉండటంపై కారణాలు ఆరా తీయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వాస్తవానికి ఓవర్‌ స్పీడ్‌ కారణంగా 79 శాతం మేర, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ కారణంగా 3 శాతం, మద్యం, మొబైల్‌ ఫోన్ల కారణంగా 1 శాతం చొప్పున ప్రమాదాలు జరుగుతున్నట్టు- అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ రహదారులపై 42 శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రాష్ట్ర రహదారుల పై 21 శాతం మేర ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

జరిమానాల కంటే ముందు హెచ్చరికలు

డ్రైవింగ్‌ నిబంధనల్ని ఉల్లంఘనల కేసుల్లో జరిమానాల కంటే ముందు హెచ్చరికలు జారీ చేయాలని సీఎం సూచించారు. ఐదుసార్ల కంటే ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్సును రద్దు చేసేలా త్వరలోనే కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయాలని భావిస్తున్నట్టు అధికారులు వివరించారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోండి. ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర రహదారులు, మున్సిపాలిటీల్లో ట్రాఫిక్‌ మార్కింగ్‌ , రోడ్‌ మార్కింగ్‌ లను సరిచేయాలన్నారు. వాహనాల ఫిట్‌ నెస్‌ కోసం ఆటోమేటెడ్ టెస్టింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు.

రీహాబిలిటేషన్‌ సెంటర్‌ ను ఏపీలో ఏర్పాటు చేసే అంశం పరిశీలించాలని.. రోడ్‌ సేప్టీ యాక్షన్‌ ప్లాన్‌ మేరకు పోలీసు, రవాణా, ఇంజనీరింగ్‌, వైద్యారోగ్యం, ఎక్సైజ్‌ శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. రోడ్‌ సేప్టీ అంశాలపై విస్తృతంగా ప్రచారం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ట్రాఫిక్‌ సెన్సిటైజ్‌ చేసేలా సందేశాలు ఇచ్చేలా చూడాలన్నారు. ప్రతీ ఏటా నవంబరు నెలలో 3వ ఆదివారం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్‌ సేప్టీ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని స్పష్టం చేశారు.

Leave a Reply