హైదరాబాద్ : కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో గంజాయి సేవించవద్దని వారించినందుకు యువకుడిని దారుణంగా హత్య చేశారు. మృతుడి సోదరుడు జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్ పటేల్ నగర్ లోని పార్కులో కొంతమంది యువకులు అర్ధరాత్రి గంజాయి సేవిస్తూ కేకలు వేస్తున్నారన్నారు. దీంతో అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్న వెంకటరమణ పార్కుల్లో కూర్చొని గంజాయి సేవించవద్దని వారించాడని తెలిపారు.
దీంతో గంజాయి సేవిస్తున్న పవన్ అక్కడే ఉన్న ఓ ఇనుప రాడ్డుతో వెంకటరమణ ఛాతీ భాగంలో పొడిచాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరమణ సోదరుడు జగదీష్ కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా, పవన్ అనే ప్రధాన నిధింతుడు పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా హత్యకు పాత గొడవలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.