బృహత్ కార్యానికి భూమిపూజ..

కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సోమవారం ఉదయం అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు.
నవంబర్ 14వ తేదీన కొడంగల్లో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి భూమి పూజకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది.
గ్రీన్ ఫీల్డ్ కిచెన్లో వండిన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.
నాణ్యమైన భోజనం తయారు చేసి అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ దాదాపు రూ.25 వరకు ఖర్చు పెడుతుంది.
ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును అక్షయ పాత్ర ఫౌండేషన్ భరిస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల సాయంతో ఈ పథకం అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. గత ఏడాది డిసెంబర్ నుండి ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతోంది.
312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి మంచి స్పందన వచ్చింది. ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
