AP | భగీరథుని కఠోర శ్రమ, దీక్ష మరువలేనిది : మంత్రి సవిత

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో, మే 4 : భగీరథ మహర్షి మహాజ్ఞాని అని, పరోపకారానికి, దీక్షకు, సహనానికి ప్రతిరూపమని ఎంత కష్టాన్నైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వారని వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. భగీరథుని వారసులుగా సగరులు ఎంతో పట్టుదల, శ్రమ, నిజాయితీతో ఉంటారని కొనియాడారు. భగీరథుని ఆశయాలను కొనసాగించాలని, ఆయన చూపిన సంకల్ప బలంతో బీసీ వర్గాల్లోని సామాన్యులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం 71వ వార్డు, గాజువాక దుర్గానగర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి భగీరథ జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భగీరథ మహర్షి జయంతి మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భగీరథుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.


అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… భగీరథుని ఆశయాలను కొనియాడారు. ఆయన చేసిన కఠోర శ్రమ, చూపిన దీక్ష ఎప్పటికీ మరువలేనిదన్నారు. భగీరథుని ఆశయాలను కొనసాగించాలని, ఆయన చూపిన సంకల్ప బలంతో బీసీ వర్గాల్లోని సామాన్యులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి బీసీలను అన్ని రంగాల్లో ముందు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో బీసీలు అధికంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. బీసీలు అభివృద్ధి చెందడానికి చదువు ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఉప్పర కులాన్ని సగరుగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం ఆనందంగా ఉందన్నారు. చరిత్రను తరతరాలకు అందించే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. భగీరథుడు మానవాళికి చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలని, ఆయన వారసులుగా ఆ కృషిని ఎప్పటికీ మరవకూడదని సూచించారు. ఈ ప్రాంతంలో పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ… భగీరథుని వారసులుగా ఒకప్పుడు ముందున్న సగరులు ప్రస్తుతం వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల అక్షరాస్యత ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. ప్రభుత్వం బీసీలకు సుమారు 2000 కోట్ల రూపాయల రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, వెనుకబడిన తరగతుల కోసం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారి అభివృద్ధికి, ఉత్పాదకత పెంపునకు ఆదరణ 3 పేరుతో 18రకాల వృత్తుల వారికి పనిముట్లు అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు బీసీ కార్పొరేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ… భగీరథుని కఠోర శ్రమ, కష్టపడే తత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. జిల్లాలో 60కోట్ల రూపాయల అంచనాలతో 2500 యూనిట్లు మంజూరు చేయనున్నారని, ఇప్పటికే 400 యూనిట్లు గుర్తించామని తెలిపారు. పేదలకు మెరుగైన జీవనం అందించేందుకు ‘బంగారు కుటుంబం’ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో 73వేల బంగారు కుటుంబాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారిణి శ్రీదేవి, స్థానిక కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, బీసీ సంఘం నాయకులు, ప్రజలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply