బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
- బీసీ భవన నిర్మాణానికి ఆర్ కృష్ణయ్య రూ. కోటి విరాళం
- చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్(50 percent reservation) కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని లేపాక్షి హోటల్లో జరిపిన ఈ సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్(Chairman Vikram), స్టేట్ డైరెక్టర్ రామకృష్ణ, నక్కలమిట్ట శ్రీనివాసులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు బీసీ భవన నిర్మాణానికి ఆర్ కృష్ణయ్య కోటి రూపాయలు విరాళంగా ప్రకటించడంతో స్థానిక బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. బీసీ సమస్యల పరిష్కారానికి జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(Chief Minister Chandrababu Naidu)ని కలిసి, ఆయన ద్వారా ప్రధానమంత్రి మోదీని సంప్రదించాలనే ప్రణాళిక రూపొందించారు. పార్లమెంట్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.
జాతీయ బీసీ కమిషన్(BC Commission)కు రాజ్యాంగ హోదా, కుల వర్గీకరణ, జనగణనలో కులగణన, వృత్తి రుణాలు వంటి డిమాండ్లలో కొన్ని అమలులోకి వచ్చాయని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్లు అమలు అయితే కుల ఆర్థిక, విద్యా, సామాజిక రంగాల్లో సమానత్వం నెలకొంటుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

