Appeal Rejected | ప్ర‌భాక‌ర్ రావుకు అమెరికా షాక్ ‍- శరణార్థి పిటిషన్ కొట్టివేత

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ తన క్రిమినల్ మైండ్‌ కు పదును పెడుతున్న సంగ‌తి విదిత‌మే. ఈ మేరకు ఆయన గత సంవత్సరం నవంబర్ 29న తనపై రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టిందని.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ అందజేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అక్కడి ప్రభుత్వం ప్రభాకర్ రావు‌ను అభ్యర్థనను తోసిపుచ్చింది. తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోమని తేల్చి చెప్పింది.

20న నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుకావాల్సి ఉంది
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌ రావు వచ్చే నెల 20న విచారణకు నాంపల్లి కోర్టు లో హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన కోర్టుకు హాజరు కాని పక్షంలో ప్రకటిత నేరస్థుడిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించడంలో ఇప్పటికే కీలక అడుగు పడింది. ఇంటర్‌పోల్ గత మార్చి 10న జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ముమ్మరం చేసింది. అయితే, ప్రభాకర్ రావును భారత్‌కు పంపించేందుకు యూఎస్ హోమ్‌ల్యాండ్ అనే సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ పూర్తి బాధ్యతలు తీసుకున్నట్లుగా సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *