AP | రౌడీ షీట‌ర్ల ఇంటికే ఎస్పీ … వ‌ణికిపోయిన కుటుంబ స‌భ్యులు

తెనాలి – తెనాలి రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు‌. కిడ్నాప్‌లు చేస్తున్నారు. స్థానికులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుంటూరు ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే నేరుగా తెనాలిలో ప్రత్యక్షమయ్యారు. ఏకంగా రౌడీ షీటర్ల ఇంటి లోపలికే వచ్చేశారు జిల్లా ఎస్పీ. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్‌ను చూసిన రౌడీ షీటర్లు, వారి కుటుంబ స‌భ్యులు భ‌యంతో వ‌ణికిపోయారు.

గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్ల ఆగడాలు మీతిమీరుతున్నాయి. అమాయకులను వేధిస్తూ, కిడ్నాపులకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రౌడీ షీటర్ల కదలికలపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రౌడీ షీటర్ల పై పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు. అంతేకాదు రానున్న రోజుల్లో నగర బహిష్కరణ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మీకంగా నేడు తెనాలి పట్టణంలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యంగా రౌడీషీటర్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పాండురంగ పేట, ఎడ్ల లింగయ్య కాలనీ, ఐతానగర్, గంగానమ్మపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనే నేరుగా రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి, ప్రస్తుతం వారి ప్రవర్తనపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ వెళుతున్నారా లేదా అనే విషయాన్ని, వాళ్ళ ప్రవర్తనను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు గమనిస్తే, స్థానికులు వెంటనే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులకు, పోలీసులకు పలు సూచనలు చేశారు ఎస్పీ సతీష్ కుమార్. పట్టణంలోని 2 టౌన్, 3 టౌన్ లిమిట్స్ లో గల రౌడీ షీటర్లపై నిఘా పెంచామన్నారు జిల్లా ఎస్పీ. ఇటీవల కాలంలో తెనాలిలో చోటు చేసుకున్న సంఘటన నేపథ్యంలో, రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిపై ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే రౌడీషీటర్లపై పిడి ఆక్ట్ పెట్టడం జరిగిందని, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద రౌడీ షీటర్ల ప్రవర్తనను బట్టి ఐదు లక్షల వరకు బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు. నగదు చెల్లించని పక్షంలో జైలుకు పంపిస్తామన్నారు. ఇప్పటికే ఒక వ్యక్తికి జైలు శిక్ష పడినట్లు తెలిపారు. జిల్లాలో రౌడీ షీటర్ల ప్రవర్తనపై,పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *