(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పనిచేస్తోందని, అర్హులందరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందాలని, అప్పుడే ప్రభుత్వ పనితీరు తెలుస్తుందని, గౌడ కార్పొరేషన్ ద్వారా గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత సామాజికవర్గీయులకు న్యాయం చేయాలని ఏపిఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి బీసీ భవన్లో ఏపి గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో కార్పొరేషన్ మొట్టమొదటి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ…
బీసీలను బాగు చేసేది చంద్రబాబు నాయుడు ఒక్కరే అన్నారు. సర్థార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో పైన పేర్కొన్న సామాజికవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం పేరుకే కార్పొరేషన్లు ఏర్పాటుచేసినా ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా దారుణంగా మోసం చేసిందన్నారు. విభజన అనంతరం 14 19లో సుమారు 110 కోట్ల రూపాయలతో గౌడ కార్పొరేషన్కు జనసత్వాలు తీసుకొచ్చామన్నారు.
గౌడ కార్పొరేషన్ కు వన్నె తీసుకువద్దాం : చైర్మన్ వీరంకి…
గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ.. కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు సాధ్యమన్నారు. కల్లు ద్వారా నీరా పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలని, తాటి ఉత్పత్తులైన తాటిబెల్లం, తాటి షుగర్ తదితరాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
గౌడ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామని. చంద్రన్న బీమా పథకం మళ్లీ అమలుకు సీఎం చంద్రబాటు దృష్టికి తీసుకువెళదామని, ఏపీలో గీత కార్మికుల కోసం తాటికల్లు బోర్డు ఏర్పాటుకు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గౌడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కృషిచేస్తామన్నారు.
గౌడ కార్పొరేషన్ను రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కన్నా మొదటిస్థానంలో ఉంచుదామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్స్ శొంఠి శివరామా ప్రసాద్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.