బాపట్ల జిల్లా: కొల్లూరు మండలంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కొట్టడంతో విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఈపూరులో గురువారం అర్ధరాత్రి ఈదురు గాలులు, వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వాటిని సరి చేసేందుకు దోనేపూడి పిఎల్డి శంకర్, అనంతవరం జెఏల్మ్ మహేష్ వెళ్లారు. 33 కేవీ లైన్ ఎల్సి తీసుకుని పనిచేస్తుండగా ఇండక్షన్ వచ్చి ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాలను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి..
బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి చెందారు. ఈ సందర్భంగా శుక్రవారం అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఎల్సీ తీసుకునే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.