ఏపీ సర్కారు నయా ఆలోచనలు
పీడీఎఫ్లో షార్ట్ మార్కుల మెమోలు
వెలగపూడి, ఆంధ్రప్రభ : ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పరీక్ష ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కంప్యూటరీకరణ (డేటా ప్రాసెసింగ్) నిర్వహిస్తారు. ఇందుకు సుమారు ఐదు లేదా ఆరు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి ఫలితాలను కొత్త విధానంలో విడుదల చేయాలని నిర్ణయించారు. సాధారణంగా ఆన్ లైన్ లో ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తారు. ఈసారి మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రతి విద్యార్థి మార్కులను పీడీఎఫ్ రూపంలో తయారు చేసి, వాట్సాప్ ద్వారా పంపనున్నారు.
విద్యార్థులకు ఈజీ చేసేందుకు..
పీడీఎఫ్ డాక్యుమెంట్లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి. గతంలో ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన తర్వాత షార్ట్ మార్కుల మెమోలను వేరుగా విడుదల చేసేవారు. కానీ, ఈసారి ఫలితాల ప్రకటనే వాట్సాప్ ద్వారా జరుగుతుండటంతో, విద్యార్థులకు తక్షణ ఫలితాలు అందే విధంగా ప్రతిదీ పీడీఎఫ్ రూపంలో అందించనున్నారు. ఈ కొత్త విధానం విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఫలితాలు అందించడంతో విద్యార్థులు తక్షణమే తమ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది