అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై రేపు (సోమవారం) విజయవాడలో నిర్వహించనున్న నేషనల్ క్వాంటం వర్క్షాప్ లో పాల్గొనేందుకు అంతర్జాతీయ ఐటీ సంస్థలుచ బహుళజాతి కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిని ఆహ్వానిస్తూ ఉండవల్లిలోని తన నివాసంలో ఘన విందు ఏర్పాటు చేశారు.
విందులో పాల్గొన్న ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై, అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఆయన మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా ఈ స్థాయిలో క్వాంటం టెక్నాలజీకి అంకితమైన పార్కును ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని భారతదేశంలో క్వాంటం పరిశోధనకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకున్నదని ఆయన చెప్పారు.
సీఎం చంద్రబాబు విందుకు హాజరైన ముఖ్య అతిథులు:
- వి. రాజన్న – టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్
- రాజీవ్ కుమార్ – మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ
- శ్రీధర్ సిద్ధు – ఎటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్
- మనీష్ వర్మ – వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్
- సుచిత్రా ఎల్లా – భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు
- జెన్నిఫర్ లార్సన్ – అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్
- జె.బి.వి. రెడ్డి – నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్
- ఫణి మిత్ర – రెడ్డీ ల్యాబ్స్
- ప్రవీణ్ రావు – అస్ట్రా జెనెకా ఎండీ
- స్కాట్ క్రౌడర్ – ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్
- అభయ్ కరాండికర్ – కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి
- అజయ్ కుమార్ సూద్ – కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్
అలాగే, అమెజాన్, హెచ్సీఎల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరందరూ రేపు (జూన్ 30న) విజయవాడలో జరగనున్న నేషనల్ క్వాంటం వర్క్షాప్ లో పాల్గొననున్నారు.