వెలగపూడి – వైసిపి సభ్యులు దొంగల్లా సభకు వస్తున్నారని, సంతకాలు పెట్టి వెళుతున్నారని మండిపడ్డారు ఎపి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు . ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రిజిష్టర్లో సంతకాలు చేసిన వారు సభలో తనకు కనిపించలేదని వ్యాఖ్యానించారు. నేడు అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు వేయడం వల్ల మరో ఇద్దరు మెంబర్లు అడగడానికి ఇబ్బంది వస్తోందన్నారు. ఇది సమంజసం కాదని.. ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండడం లేదని.. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. సభ్యులు సభకు రావాలని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయిన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని సూచించారు
మొఖం చాటేయడం ఏమిటీ..
ప్రజా ప్రతినిధులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని, మొఖం చాటేయడం ఎందుకని సభాపతి అయ్యన్న వైఎస్సార్సీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడం ఏంటన్నారు. హజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదన్నారు. వై బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధ రెడ్డి, విశ్వేశరరాజులు తదితరులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం తరువాత వేర్వేరు రోజుల్లో వారు సంతకాలు చేసి వెళ్లిపోయారన్నారు. లోపల సభ జరుగుతుంటే బయట రిజిస్ట్రార్ లో సంతకాలు పెట్టి పారిపోతున్నారని అన్నారు. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని వారికి హితవు పలికారు అయ్యన్న పాత్రుడు .
మైక్ ఇస్తాం… గౌరవంగా సభలో మాట్లాడండి..
దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం వైఎస్సార్సీపీ సభ్యులకు లేదని, వారు గౌరవంగా సభకు వచ్చి మాట్లాడవచ్చు కదా అని స్పీకర్ అయ్యన్న అన్నారు. ఇప్పటికైనా ఈ విధానం మాని సభకు రావాలని వైసిపి సభ్యులకు సూచించారు.