AP | కార్యకర్తే పార్టీ అధినేత.. : మంత్రి నారా లోకేష్

  • వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
  • ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు
  • కార్యకర్తలకు అండగా నిలవాలని నేతలకు పిలుపు

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈరోజు (బుధవారం) స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా మొదట కార్యకర్తలతో భేటీ అవుతానన్నారు.

బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ, పార్టీ సభ్యత్వం, ఓటర్ వెరిఫికేషన్, మన టీడీపీ యాప్ లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలు, నాయకులతో ఎక్కువ సమయం కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.

పనిచేసే వారిని ప్రోత్సహిస్తా..

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అక్కడి క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులను కలిసి మాట్లాడుతున్నట్లు చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన పర్యటనలో కార్యకర్తలు, నేతలకు సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు.

పార్టీ, ప్రభుత్వం రెండూ అనుసంధానమై ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో నూతనంగా క్లస్టర్, యూనిట్, బూత్ విధానాన్ని తీసుకువచ్చామని, గతంలో తాను పాదయాత్ర చేసినప్పుడు.. చాలా మంది కార్యకర్తలు తనను కలిసి వారి సమస్యలు చెప్పారని అన్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తామన్నారు. పనిచేసే వారిని ప్రోత్సహిమన్నారు. పార్టీ లేకపోతే ఎవరూ లేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

కార్యకర్తలకు అండగా నిలబడాలి

ఎన్నికల్లో గెలిచాక, తిరుగులేదనే ధోరణి సరికాదని మంత్రి లోకేష్ హెచ్చరించారు. తాను 91వేల మెజార్టీతో గెలిచానని, ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నానని అన్నారు. గత ఐదేళ్లలో అనేక కష్టాలు ఎదుర్కొన్నామని, అక్రమ కేసులు పెట్టారని, లాఠీఛార్జి చేశారని, అవన్నీ మర్చిపోకూడదన్నారు.

తిరుపతిలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కష్టపడాలని, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. త్వరలోనే కొత్త వ్యవస్థ తీసుకొస్తున్నామని జాతీయ అధ్యక్షుడి నుంచి బూత్ ఇంఛార్జ్, బూత్ కమిటీ సభ్యుల వరకు అందరూ కుటుంబ సాధికార సారధిలో(కేఎస్ఎస్) నమోదు కావాల్సి ఉంటుందన్నారు.

పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత పార్టీ పదవి కావాలన్నా, నామినేటెడ్ పోస్టు కావాలన్నా కేఎస్ఎస్ లో ఉండాలన్నారు. కేఎస్ఎస్ కార్యక్రమం తర్వాత క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్‌లను నియమిస్తామన్నారు. అనంతరం గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు నియమించడం జరుగుతుంది. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి

వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలోనే పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది. జగన్ రెడ్డికి వెయ్యి పెంచడానికి నాలుగున్నరేళ్లు పట్టిందన్నారు. వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు, వికలాంగ పెన్షన్ రూ.6 వేలు, పూర్తి వికలాంగులకు రూ.15 వేలు పెన్షన్ అందిస్తున్నామన్నారు.

అన్న క్యాంటీన్లు ఏర్పాటు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఏప్రిల్, మే నెల నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారని అన్నారు. జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైంది? సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, ఏమైంది? ఆయన ప్రశ్నించారు. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

జగన్ అప్పులు చేసి దిగిపోయారని, అయినప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, టీఏ, డీఏ బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. ప్రజలను, టీడీపీ నేతలను వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టారని వారిని పద్ధతి ప్రకారం చట్టపరిధిలో శిక్షిస్తామన్నారు.

కోటి మంది పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు

పార్టీనే అందరికి సుప్రీం అని, పార్టీ లేకపోతే యువగళం లేదని, తాను లేనని లోకేష్ అన్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా కార్యకర్తలతో సమావేశమవుతానని, క్లస్టర్, యూనిట్, బూత్ లను బలోపేతం చేయాలని అన్నారు.

కార్యకర్తలకు ఏ పార్టీ చేయని విధంగా ప్రమాద బీమా రూ.5 లక్షలు చేశామని, త్వరలో కార్యకర్తల ఆరోగ్యానికి సంబంధించి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందు పార్టీ కేంద్ర కార్యాలయంలో కేరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటుచేస్తామన్నారు.

తనకు అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు లేరని, కానీ పార్టీ కోటి మంది కుటుంబ సభ్యులను ఇచ్చిందన్నారు. అనంతరం తిరుపతి కార్పొరేటర్లతో మంత్రి సమావేశం అయ్యారు. వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *