ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ఆగస్టు 25వ తేదీ నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదే సమయంలో, ఆగస్టు 23న గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి, పై స్థాయిలో నైరుతి దిశగా వంగినట్లు గమనించినట్లు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఇది జార్ఖండ్ వైపు పశ్చిమ–వాయువ్య దిశలో కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నైరుతి–పశ్చిమ గాలులు వీచనున్నాయి. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది.

ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు.

Leave a Reply