న్యూ ఢిల్లీ – అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్ (Israel) జరిపిన దాడి కారణంగా ఇరాన్ (Iran)_ తమ గగనతలాన్ని (Air Space) శుక్రవారం మూసివేసింది. ఈ పరిణామంతో ముంబై నుంచి లండన్ (london) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ131ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. అలాగే, మొత్తం 16 విమానాలను ఎయిరిండియా(Air India) దారి మళ్లించడమో, వెనక్కి పిలిపించడమో చేసినట్టు సమాచారం.
షెడ్యూల్ ప్రకారం నేడు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సాధారణంగా ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంది. అయితే, ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్య నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా తమ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ ఆకస్మిక నిర్ణయంతో అప్పటికే ప్రయాణంలో ఉన్న పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా ఇవాళ తెల్లవారుజామున ముంబయి నుంచి లండన్ హీత్రూకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ129, గాలిలో సుమారు మూడు గంటల పాటు ప్రయాణించిన అనంతరం తిరిగి ముంబయి చేరుకుంది.
విమానయాన సమాచార సంస్థ ఫ్లైట్రాడార్24 అందించిన వివరాల ప్రకారం ఏఐ129 విమానం ఉదయం 5:39 గంటలకు ముంబయి నుంచి టేకాఫ్ అయింది. అయితే, ఇరాన్ గగనతలాన్ని మూసివేయడంతో ఈ విమానం ప్రయాణాన్ని కొనసాగించలేకపోయింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించక తప్పలేదని తెలిపింది.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఇరాన్లో నెలకొన్న పరిస్థితులు, అక్కడి గగనతలం మూసివేత కారణంగా మా పలు విమానాలు దారి మళ్లించబడుతున్నాయి లేదా బయలుదేరిన చోటుకే తిరిగి వస్తున్నాయి” అని ఎయిర్ ఇండియా తన ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ పేర్కొంది.
ముంబయి-లండన్ సర్వీసుతో పాటు ఇతర అంతర్జాతీయ ఎయిర్ ఇండియా విమానాలపైనా ఈ ప్రభావం పడింది. లండన్ హీత్రూ నుంచి ముంబయి వస్తున్న ఏఐ130 విమానాన్ని వియన్నాకు, న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఏఐ102 విమానాన్ని షార్జాకు, న్యూయార్క్ నుంచి ముంబై వస్తున్న ఏఐ116 విమానాన్ని జెడ్డాకు, లండన్ హీత్రూ నుంచి ఢిల్లీ వస్తున్న ఏఐ2018 విమానాన్ని ముంబయికి దారి మళ్లించారు. అలాగే ముంబయి నుంచి న్యూయార్క్కు వెళ్తున్న ఏఐ119, ఢిల్లీ నుంచి వాషింగ్టన్కు వెళ్తున్న ఏఐ103 విమానాలు కూడా తాము బయలుదేరిన విమానాశ్రయాలకే వెనుదిరిగాయి.
ఈ అంతరాయం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ప్రభావితమైన ప్రయాణికులకు వసతి, టికెట్ డబ్బు వాపసు (రీఫండ్) లేదా ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణ తేదీ మార్పు (రీషెడ్యూలింగ్) వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వివరించింది.