31 మంది కి డిఎన్ ఎ పరీక్షలు పూర్తి
12 మృత దేశాలు బందువులకు అప్పగింత
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ దేహం కూడా గుర్తింపు
రేపు అయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 279 మంది మరణం
గాయపడిన 13 మందికి ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో ఫోరెన్సిక్ బృందాల నిరంతర కృషి
అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 31 మందిని డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్టు సివిల్ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. వీరిలో 12 మంది మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహం కూడా డిఎన్ ఎ ద్వారా గుర్తించారు.. అనంతరం ఆయన మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.. దీంతో రేపు ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.,
సివిల్ ఆసుపత్రి ఏడీఎంఎస్ డాక్టర్ రజనీష్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ “ఇప్పటివరకు 31 మంది వ్యక్తుల డీఎన్ఏ సరిపోలింది, వారిని గుర్తించాం. వీరిలో 12 మృతదేహాలను ఉదయ్పూర్, వడోదర, ఖేడా, కుషీనగర్, అహ్మదాబాద్లోని వారి స్వస్థలాలకు పంపించాం” అని తెలిపారు. “మిగిలిన వారి ఆప్తుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు మరికొన్ని కుటుంబాలు ముందుకు రావాల్సి ఉంది. ఇతరుల డీఎన్ఏ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది” అని ఆయన వివరించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఈ ఘటనలో 279 మంది మరణించినట్లు తెలిపారు.. వారిలో 25 మంది మెడికోలు ఉన్నట్లు చెప్పారు..ఇక గాయపడిన 13 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కూడా ఆయన వెల్లడించారు.వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు..
మాంసపు ముద్దలే మిగిలాయి ..
విమాన ప్రమాద సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత రావడంతో మృతదేహాలు తీవ్రంగా కాలిపోయాయి. కేవలం మాంసపు ముద్దలు మాత్రమే మిగిలాయి.. ఏ ఒక్కరిని గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరి అయ్యాయి. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ) కు చెందిన ఫోరెన్సిక్ బృందాలు ఈ బృహత్తర గుర్తింపు ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు త్వరితగతిన ఊరట కలిగించేందుకు ఈ బృందాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి.