అఘమర్షణ సూక్తం

”అఘమర్షణో మధుఛందసుడు” అనే ఋషి కనుగొన్న మంత్రమే అఘమర్షణ సూక్తం. సృష్టి అంతా క్రమపద్ధతిలో సహజంగా, నియమబద్ధంగా ఏర్పడినట్లు కనబడినా వాటిని ఆ విధంగా ఏర్పాటుచేసిన జ్ఞానతత్త్వం ఒకటుంది. ఆ జ్ఞాన తత్త్వాన్నే మనం ”వశీ” లేదా విశ్వాత్మ అని పిలుస్తున్నాము. భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, సృష్టి ఆరంభాన్ని గూర్చి చెపుతుందీ అఘమర్షణ సూక్తం.
ఈ అఘమర్షణ సూక్తంలోని 17 మంత్రాలలో సహ జీవన విధానాన్ని, శీల నిర్మాణ ప్రాధాన్యాన్ని గూర్చి చెప్పబడింది. ఇతరజీవులను క్షోభకు గురిచేయడం, పాపంచేయడం లాంటి అధార్మిక విధానాలను ఖండించాయి.
ఇవ్వడం తీసుకోవడం రెండూ మన భారతీయ సంప్రదాయంలో ఉన్నతమైన లేదా ఉదాత్తమైన ప్రక్రియలే. ఇవ్వడం శ్రద్ధతో, భగవదర్పితంగా ఇవ్వాలి, న్యాయబద్ధమైనది, ధార్మిక ప్రవృత్తితో ఆర్జించినదైన తన కష్టార్జితాన్ని మాత్రమే ఇవ్వాలి. తీసుకోవడం భగవత్సేవకై వినియోగించేందుకే తీసుకోవాలి. అన్యాయార్జిత విత్తంలో క్రూరత్వపు ఛాయలు లీనమయి ఉంటాయి. ఆ సొత్తు పవిత్ర కార్యాచరణను కలుషితం చేస్తుంది కాబట్టి ఆ ద్రవ్యాన్ని వాడకూడదనేది నియమం. ప్రాకృతిక వనరులు దుర్వినియోగం చేయడం పాపకార్యంగా భావించబడింది. అలాగే ప్రతిగ్రహిత కూడా అవసరానికి మించి తీసుకోకూడదు.
ఈ ఇవ్వడం తీసుకోవడం అనే ప్రక్రియలో మనస్సు చేత వాక్కు చేత కర్మలచేత తన వల్ల కాని తన వారి వల్ల కాని తెలిసి కాని తెలియక కాని ఇచ్చిన వారు లేదా తీసుకొన్న వారిచే చేయబడిన పాపకత్యాలను ఇంద్రుడు, వరుణుడు, వారుణి, బృహస్పతి, సూర్యుడు పోగొట్టాలని ప్రార్థిస్తున్నాడు, సాధకుడు.
ఇందులో ”అప్సుమతే అగ్నయే” అనే పదాన్ని వాడారు. అంటే నీటిలో అవ్యక్తంగా ఉన్న అగ్ని అని అర్థం. నీటిలో అగ్ని ఎలా ఉంటుందంటే అగ్నికి నీరే ఆధారం అనీ లేదా అగ్నికన్నా ముందు ఉన్నది నీరేనని స్పష్టమవుతున్నది. ఈ విశాల విశ్వ సృజనలో ముందుగా ప్రళయరూపమైన కాళరాత్రి ఉత్పన్నమైనది. దాని నుండి సముద్రము అనగా నీరు ఉద్భవించింది. నీటికి అధిపతి వరుణుడు. నీటిలో ప్రకాశించే జ్యోతిని నేనే.. ఆ జ్యోతిగా ప్రకాశించే బ్రహ్మమును నేనే… నేనే బ్ర#హ్మమును.. అంటుందీ సూక్తం.
సాధకుడు అపవిత్రమైనవీ, తనకు దు:ఖాన్ని కలిగించేవి అయిన నీటిలో ఉండే అన్ని మలినాలు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాడు. అన్ని అస్వస్థతలకు మూలం నీటి కాలుష్యమే కాబట్టి ఆ నీటిని పరిశుభ్రంగా ఉంచుకోండని హెచ్చరించడం కనిపిస్తుంది.
ఈ సూక్తం మానవ మూలాలకు భాష్యం చెపుతుంది. పాపరహితుడను, నిష్కళంకుడను, బంధరహితుడను, దుష్టర#హతుడను అయిన నేను స్వర్గ అగ్రానికి పోయి బ్రహ్మకు దీటయిన పదవిని పొందుదును గాక! అంటే ఏమిటి? మహత్తుగా చెప్పబడే భగవత్‌ శక్తి యొక్క ప్రకటన లేదా వ్యక్తీకరణ వల్ల ఆకృతి దాల్చిన మనందరి స్వరూపం, స్వభావం, లక్షణం స్వతహాగా పవిత్రమైనదే. కాని మనలో ఉండే ఉన్నత లక్షణాలతో కూడా తోబుట్టువుల వలె వచ్చిన అజ్ఞానం, అహంకారం, అభిజాత్యం లాంటి లక్షణాలు వెలుగు చూడడం వల్ల సహజమైన లక్షణాలు అధోముఖంగా నిలిచిపోయాయి. ఈ అసహజ లక్షణాలను విడవడం జ్ఞానం అదే బ్ర#హ్మత్వం, సమాదరించడం అజ్ఞానం. అజ్ఞానం వల్ల దు:ఖం, జ్ఞానం వల్ల సుఖం మనిషి పొందుతాడు. ఇక్కడ ”ఖం” అనేది రెంటిలో సమానమే కాని వాటి ముందున్న ప్రత్యయం ”దు:” అంటే దుర్మార్గాన్ని ఆశ్రయిస్తే దు:ఖాన్ని, ”సు” మంచిని ఆశ్రయిస్తే సుఖాన్ని పొందుతామని అన్యాపదేశంగా బోధిస్తుంది. నిజానికి ”ఖం” అంటే ఆకాశం. ఆకాశం స్వచ్ఛమైన పాత్రలాంటిది. దానిలో ఏ నీటిని పోస్తే పాత్రకూడా ఆ రంగులోనే కనిపిస్తుంది… స్వఛ్ఛత, సరళత, సంయమనత, సాత్వికత దైవిక భావాలు అందువల్ల వాటిని ఆశ్రయించడం వల్ల మనమూ దైవ లక్షణాలను సంతరించుకుంటామనే భావనను తెలుపుతుంది ఈ సూక్తం.
ఇంతకు పూర్వం ఉన్నది ఇప్పుడు ఉంటున్నదీ అయిన ఈ ప్రపంచాన్ని కాపాడేవాడు వరుణుడు. ఈ ప్రపంచమూ శాశ్వతమయినదే. అది ప్రళయమందు నీటిలో లయమయి మరల జీవకణాలుగా ఆవిర్భవించి తిరిగి ప్రపంచంగా పరిణామం చెందుతున్నాయి. అంటే గతంనుండి వర్తమానంద్వారా భవిష్యత్తులోనికి పయనించడం జరుగుతుంది, అంటుందీ సూక్తం.

  • పాలకుర్తి రామమూర్తి

Leave a Reply